కానుకల్లో గజిబిజి
విద్యా కిట్ల పంపిణీలో రోజుకో నిబంధన
వెంటవెంటనే మార్పులు
తలలు పట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయులు
ఒంగోలు విద్య, అక్టోబరు 10 :* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యాకానుక కిట్ల పంపిణీ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రతి రోజూ మారుస్తుండటం గందరగోళానికి దారితీస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు. విద్యా కానుక కిట్ల పంపిణీ రెండు రోజులు పూర్తయిన తర్వాత పాఠశాల విద్య కమిషనర్ వి. చినవీరభద్రుడు శనివారం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల యుడైస్ వివరాలను ప్రధానోపాధ్యాయుల లాగిన్లో ఉంచి వారికే కిట్లు పంపిణీ చేయాలని అందులో స్పష్టం చేశారు.
మొదట 2019-20 యుడైస్ డేటా ప్రకారం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆప్రకారంగానే కొన్ని పాఠశాలల్లో పంపిణీ పూర్తయింది. అయితే తాజాగా వచ్చిన ఉత్తర్వులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అయోమయానికి గురిచేశాయి. తొలుత వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థికి ఆ స్కూల్లోనే పాఠ్యపుస్తకాలు మినహా స్కూలు బ్యాగు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఇదే పరిస్థితి ఏడు, ఎనిమిది తరగతులు ఉన్న యూపీ స్కూళ్లలో కూడా తలెత్తింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పాసైన విద్యార్థులు ఆరో తరగతికి ప్రైవేటు పాఠశాలలకు వెళితే అలాంటి వారి నుంచి కిట్లు వెనక్కు తీసుకోవడం ఎలా అన్న విషయం అర్థంకాక హెచ్ఎంలు ఆందోళన చెందుతున్నారు.
నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులు ఏ పాఠశాలలో చేరితే అక్కడే పూర్తిస్థాయి విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా పథకం ప్రారంభానికి ముందు ప్రభుత్వం మొదట రోజు 50 మందికి మాత్రమే కిట్లు పంపిణీ చేయాలని సూచించింది. అనంతరం పాఠశాలల్లోని మొత్తం విద్యార్ధుల్లో మూడోవంతు మందికి ఇవ్వాలని ఆదేశించింది. దీనికితోడు సర్వర్ సమస్యతో తొలి రెండు రోజులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
Popular Posts