Monday, March 29, 2021

సచివాలయాలపై జగన్‌ కీలక నిర్ణయం-రెవెన్యూకే పెత్తనం- పంచాయతీరాజ్‌కు షాక్‌



Read also:

సచివాలయాలపై జగన్‌ కీలక నిర్ణయం-రెవెన్యూకే పెత్తనం- పంచాయతీరాజ్‌కు షాక్‌

ఏపీలో పాలనా సంస్కరణల దిశగా అడుగులేస్తున్న వైసీపీ సర్కారు సచివాలయాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సచివాలయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా పంచాయతీల్లో తమకు అధికారాలు ఉంటాయని భావించిన కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇది షాక్ ఇచ్చింది. అంతే కాదు గ్రామ పంచాయతీల్లో అధికారం చెలాయిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇకపై అది దూరమవుతుంది. అంతిమంగా రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవోలకే కీలక అధికారాలు కట్టబెట్టడం ద్వారా పంచాయతీరాజ్‌ శాఖకు భారీ షాక్‌ ఇచ్చారు జగన్.

AP-GS-VS

సచివాలయాలపై ఇక రెవెన్యూ పెత్తనం

ఏపీ గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అంశాల్లో ప్రజలకు సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్ధ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల మధ్య అగాధం పెంచింది.

ముఖ్యంగా సచివాయాలపై ఎవరి పెత్తనం ఉండాలన్న విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్లడంతో ఈ వ్యవహారం క్లిష్టంగా మారిపోయింది. గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకూ పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు ఉండగా.. ఇప్పుడు ఆ అధికారాన్ని వీఆర్వోలకు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.

సచివాలయాల బాధ్యత ఇక వీఆర్వోలకే

ఏపీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు జీతభత్యాల నుంచి అన్ని అధికారాలను స్ధానిక వీఆర్వోలకు కట్టబెడుతూ గ్రామ సచివాలయాల శాఖ తాజాగా జీవో నంబర్‌ 2 జారీ చేసింది. దీంతో సచివాలయాల్లో ఇప్పటివరకూ అధికారం చెలాయించిన పంచాయతీ కార్యదర్శులు ఇక నామమాత్రంగా మారిపోయారు. ఇక తమ శాఖ రెవెన్యూ పరిధిలో ఉన్న వీఆర్వోలతో నడుస్తుందనేలా సచివాలయాలశాఖ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తాజాగా సచివాలయాల డీడీవో అధికారాలు ఎవరికి ఉండాలన్న అంశంపై ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఉద్యోగులు అన్ని పథకాల మీద పట్టు ఉండి, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన డిజిటల్ అసిస్టింట్‌కు ఇస్తే బావుంటుందని ఎక్కువగా సూచించారు. మరికొందరు పంచాయతీ కార్యదర్శులకే ఈ అధికారం ఇవ్వాలని కోరారు. ఇంకొందరు వీఆర్వోకు డీడీవో అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పారు. చివరికి ప్రభుత్వం వీఆర్వోలకే డీడీవో అధికారాలు కట్టబెట్టింది.

వీఆర్వోలకు పెత్తనంపై సెక్రటరీల్లో ఆగ్రహం

గ్రామ సచివాలయాలపై వీఆర్వోలకు పెత్తనం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్మారు. సచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన కార్యదర్శులంతా ఉన్నత విద్యావంతులు. వీరి కనీస విద్యార్హత డిగ్రీ. పీజీలు, ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివిన వారు కూడా ఉన్నారు. కానీ వీఆర్వో ఉద్యోగ నియామకాల్లో విద్యార్హత ఇంటర్‌. అందులోనూ డిగ్రీ చదివిన వారు ఉన్నారు. కానీ ఎక్కువ పంచాయతీల్లో టెన్త్‌ విద్యార్హతతో వీఆర్‌ఏ ఉద్యోగం సంపాదించి ప్రమోషన్లతో వీఆర్వో అయిన వారు ఉన్నారు. ఇప్పుడు సచివాలయాలపై వీఆర్వోలకు పెత్తనం ఇవ్వడాన్ని కార్యదర్శులు జీర్ణించుకోలేని పరిస్ధితి.

ఇక వీరంతా ఉత్సవ విగ్రహాలే

ప్రస్తుతం ఏపీలో పంచాయతీరాజ్‌ వ్యవస్ధలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, పంచాయతీరాజ్‌ ఈవో, డీఎల్ పీవో, డీపీవో స్ధాయిల్లో ఉంది. సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయాలకు వెళ్లిపోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అభివృద్ధి పనులు మాత్రమే వీరికి మిగిలాయి. సచివాలయాలపై కార్యదర్శులకే కాదు సర్పంచ్‌లకూ పెత్తనం లేకుండా పోయింది. దీంతో ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో ఆఫీసుల పరిస్దితి ప్రశ్నార్ధకంగా మారింది. క్రమంగా ఈ పోస్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోనున్నాయి. సర్పంచ్‌లు కూడా గ్రామ సభల్లో పథకాల లబ్దిదారుల ఎంపికలో కేవలం అధ్యక్షులుగా మాత్రమే ఉంటారు.. వీరికి ఎలాంటి అధికారం ఉండదు. అలాగే మండల స్ధాయిలో ఎంపీడీవో, జిల్లా స్ధాయిలో జడ్పీ సీఈవోలు కూడా నామమాత్రంగా మారిపోనున్నారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీకి జీతమిచ్చే అధికారం ఎంపీడీవోకి ఉండగా.ఈ పదవిని పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మార్చనున్నారు. అప్పుడు ఎంపీడీవోకి కూడా పెద్దగా పని ఉండదు. ఆయనపై ఉండే జడ్పీ సీఈవో కూడా ఖాళీగా మారడం ఖాయం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :