ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రీచ్లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా చిరు వ్యాపారులకు ఇచ్చే జగనన్న చేదోడు పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా 6 మెడికల్ కాలేజీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాలు కేటాయించారు. మచిలీపట్నం పోర్టు డీపీఆర్కు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని కేబినెట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్ఈబీ పరిధిలోకి ఆన్లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాలు, డ్రగ్స్, గంజాయిని నిరోధించే బాధ్యతలు ఎస్ఈబీకి అప్పగించారు.
ఇకనుంచి ఆఫ్లైన్లోనూ ఇసుక.
నూతన ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుకను ఇకనుంచి ఆఫ్లైన్లోనూ. సొంత వాహనాల్లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎస్ఈబీని బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. ఎస్ఈబీకి అదనపు పోస్టులు కేటాయించామన్న మంత్రి. డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తుపదార్థాలను ఎస్ఈబీ పరిధిలోకి తెచ్చామన్నారు. ఎస్ఈబీకి ఎర్రచందనం టాస్క్ఫోర్స్ను అనుసంధానం చేస్తామని తెలిపారు.
జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం
జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. బియ్యం సంచులు పక్కదారి పట్టకుండా క్యూఆర్ కోడ్ వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. పాడిపరిశ్రమను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.5,700 కోట్లు
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై కేబినెట్లో చర్చించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. రూ.5,700 కోట్లతో పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో తేదీలు ఖరారు కాలేదు. ఈ నెలలోనే శాసనసభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నెల 24 న జగనన్న తోడు పథకం ప్రారంభం
'జగనన్న తోడు' ద్వారా చిరువ్యాపారులకు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. 'జగనన్న తోడు' కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 24న జగనన్న తోడు పథకం ప్రారంభంకానుందని వెల్లడించారు. ఈ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు అందచేస్తున్నామని తెలిపారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
500 లీటర్ల కంటే ఎక్కువగా పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకే వద్దే పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు కెబినెట్ ఆదేశించింది. పశువుల దాణాను ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు నిర్ణయించింది.
ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కెబినెట్ ఆమోదం
ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కెబినెట్ ఆమోదం తెలిపింది. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల సమగ్ర రీ-సర్వేపై చర్చ జరిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే చేయాలని కెబినెట్ నిర్ణయించింది. రీ-సర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి చేస్తామని తెలిపింది. 4500 సర్వే టీములను సిద్దం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నామని మంత్రి తెలిపారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నవంబర్ 17న ప్రారంభం
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోని సున్నా వడ్డీ బకాయిలు 1051 కోట్లు కూడా ఇప్పుడు చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఏ సీజనులో జరిగిన పంట నష్టానికి ఆ సీజనులోనే అందిస్తున్నామన్నారు. అక్టోబర్ పంట నష్టం పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి అవుతుందన్నారు. ఈ నెలాఖరులోగానే ఇన్ పుట్ సబ్సిడీని అందించనున్నామని తెలిపారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తాం
ప్రతిపార్లమెంట్ నియోజకవర్గంలో స్టేడియాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి భూ కేటాయింపులు చేస్తున్నామన్నారు.
జైళ్ల నుంచి మహిళల విడుదలకు కేబినెట్ ఆమోదం
ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి కలగనుంది. వారి విడుదలకు కెబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోసం దస్త్రాన్ని కూడా ప్రభుత్వం పంపింది.
వైద్యారోగ్యశాఖ టీచింగ్ స్టాఫ్కు యూజీసీ స్కేల్ అమలుకు నిర్ణయం
వైద్యారోగ్య శాఖలోని టీచింగ్ స్టాఫ్ కు యూజీసీ స్కేల్ అమలుకు కెబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా ప్రభుత్వం పై భారం పడుతుంది. 3500 మందికి లబ్ది కలుగుతుంది.
విశాఖలో 150 ఎకరాల్లో అదానీ డేటా సెంటర్కు కేంద్రం అంగీకారం
విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం లభించింది. 150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. అదానీ డేటా సెంటర్ వెళ్లిపోయిందని చంద్రబాబు చేసిన విమర్శలు నిజం కాదని తేలిపోయిందని మంత్రి కన్నబాబు అన్నారు. వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని అర్హులకు సంక్షేమ పథకాల వర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల ఆరో తేదీ నుంచే ప్రారంభించనున్నామన్నారు.
నవంబర్ 10 నుంచి మరో ఆరు జిల్లాల్లో. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నవంబర్ పదో తేదీ నుంచి మరో ఆరు జిల్లాల్లో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి తెలిపారు.