డీఏ కావాలా? పెండింగు జీతాలా
మొదట ఏది కావాలి
ఉద్యోగ సంఘ నాయకుల ముందు సజ్జల ప్రతిపాదన
ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్
సలహాదారు వరకే వీరి సమావేశాలు పరిమితం
ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన ఎన్ జీ వో సంఘం
రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు డీఏలు, పెండింగు జీతాలు, పీఆర్సీ కోసం ఎదురుచూస్తుంటే ఆ రోజులు ఇంకా దూరం జరుగుతున్నాయి. ఉద్యోగులకు మొదట పెండింగు జీతాలు ఇమ్మంటారా? ఒక డీఏ ప్రకటించమంటారా? అని ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ముందు ప్రతిపాదన ఉంచింది. ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. తక్షణమే పరిష్కరించడానికి వీలున్న అంశాల్లో పెండింగు జీతాలు ముందు కావాలా? ఒక్క డీఏ ముందు కావాలా అని సజ్జల కొందరి ముందు ప్రతిపాదన ఉంచారు. ఎన్ జీ వో సంఘం నాయకులు, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ, అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు, గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు అరవ పాల్ తదితరులతో సజ్జల మాట్లాడారు . ప్రభుత్వ తరఫున ప్రతిపాదనలు ఉంచారు. తొలుత పెండింగు జీతాలు రెండు విడతల్లో ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. డీఏ ఇచ్చేటట్లయితే నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్ లో ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు కొందరు నాయకులకు సజ్జల చెప్పారు. మూడు డీఏలు ఇవ్వాల్సిందేనని, పెండింగు జీతాలు కూడా తక్కువ విడతల్లో ఇవ్వాలని అరవ పాల్ స్పష్టం చేశారు. మిగిలిన నాయకులంతా డీఏలు, పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్లు వినిపించి వచ్చారు.
ముందే నిర్ణయమైన ప్రకారం ఎన్ జీ వో సంఘం నాయకులు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లారు. వాళ్లు ఏం చెప్పారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఎన్ జీ వో సంఘం నాయకులకు ముఖ్యమంత్రి ఏం చెబుతారనేది చూడాలి.