పీ ఆర్ సీ, డీఏ లపై స్పష్టత వచ్చేనా ముఖ్యమంత్రితో నేడు ఎన్ జీ వో సంఘం నేతల భేటీ
చాలా కాలం తర్వాత ఎన్ జీ వో సంఘం రాష్ర్ట నేతలు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను గురువారం కలవనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన వివిధ కీలకాంశాలపై ముఖ్యమంత్రికి వీరు నివేదించనున్నారు. ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు నాయకులు సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంటు ఖరారైంది. ప్రధానంగా ఎన్ జీ వో సంఘం అయిదు అంశాలపై ముఖ్యమంత్రికి నివేదించనుందని సమాచారం. 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను తక్షణమేఅమలు చేయాలని నాయకులు కోరుతున్నారు. పీ ఆర్ సీ పై మరో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ఎన్ జీ వో సంఘం ఆ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటుకు సంబధించిన ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద ఉంది. మరో వైపు మూడు డీఏలు తక్షణమే ప్రకటించాలని వీరు కోరుతున్నారు. పెండింగు జీతాల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు మరికొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీంతో పాటు ఆరోగ్య కార్డులు, సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా వీరు సీఎంకు నివేదించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పీ ఆర్ సీ పై ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏమనుకుంటున్నారో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి విని పంపుతారా, కొన్నింటిపై నైనా ప్రభుత్వ వైఖరి వెల్లడిస్తారా అన్నది చూడాలి.
కౌన్సిల్ కు ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారా
ఎన్ జీ వో సంఘం రాష్ర్ట కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇంతకుముందు తిరుపతిలో సమావేశాలు జరిగాయి. నిజానికి సెప్టెంబర్ నెలలోనే ఎన్ జీ వో సంఘం కౌన్సిల్ నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా ఆ ఆలోచనపై మరో అడుగు కూడా పడలేదు. సాధారణంగా ఎన్ జీ వో సంఘం కౌన్సిల్ కు ముఖ్యమంత్రి హాజరవుతుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ జీ వో సంఘం కౌన్సిల్ నిర్వహించాల్సిన సమయం వచ్చినందున ముఖ్యమంత్రిని ఈ సమావేశాలకు ఆహ్వానించి ఆయనకు వీలైన తేదీని తెలుసుకుని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని సమాచారం.