ఆర్డినెన్సా.చెల్లింపులా
ఆ రెండు నెలల పెండింగు జీతాలపై ప్రభుత్వంలో చర్చలు , 12శాతం వడ్డీ చెల్లింపులు కష్టమేనని సూత్రీకకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కారణంగా మార్చి , ఏప్రిల్ నెలలకు ఆపివేసిన సగం జీతాలు, పెన్షనర్లకు నిలిపివేసిన పింఛన్ల చెల్లింపుపై ప్రభుత్వంలో చర్చ సాగుతోంది. రాష్ర్ట హైకోర్టు రెండు నెలల్లో ఆ పెండింగు జీతాలు 12శాతం వడ్డీతో చెల్లించాలని ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఆ గడువు సమీపించడంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దిశగా కసరత్తు సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో 12శాతం వడ్డీ చెల్లింపు సాధ్యం కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. కరోనా వల్ల అసలే రాష్ర్ట ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయని, ఈ పరిస్థితుల్లో వడ్డీ రూపంలో రూ. కోట్ల చెల్లింపులు సాధ్యం కాదని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ విషయాన్ని రాష్ర్ట ఉన్నత న్యాయస్థానానికి తెలియజేయనున్నారు. మరో వైపు హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావస్తుండటంతో చెల్లింపులపై సర్కార్ లో చర్చ సాగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం గతంలోనే తీసుకువచ్చినట్లు ఆర్డినెన్సు తీసుకువచ్చే అంశమూ పరిశీలనలో ఉందని సమాచారం. ఆర్డినెన్సు తీసుకురావాలంటే రాష్ర్ట మంత్రిమండలి ఆమోదమూ కావాలి. వచ్చే వారంలో మంత్రి మండలి సమావేశమవుతోంది. ఆ సమాయానికి దీనిపై ఒక నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కరోనా వంటి సమయంలో జీతాల వాయిదా లేదా కోతకు ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా ఈ ఆర్డినెన్సు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్సు తీసుకురావడమే కాకండా దానికి చట్ట రూపం ఇస్తోంది.
రాష్ర్ట ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కొందరు ఉద్యోగ సంఘం నాయకులు మాత్రం ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులు ఎవరూ వడ్డీ కోరుకోవడం లేదని- అక్టోబరు నెలలో చెల్లింపులకు వీలు కల్పించేలా ఉత్తర్వులు ఇచ్చి ఆ నెలలో ఎఫ్పుడు చెల్లించినా పర్వాలేదని, దసరా సమయంలో ఆ మొత్తాలు ఉద్యోగులకు అందేలా ఇచ్చినా చాలని కొందరు నాయకులు సూచిస్తున్నారు. సెప్టెంబరు 24 కల్లా దీనిపై ఒక నిర్ణయానికి ప్రభుత్వం రావచ్చని సమాచారం.