Read also:
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. అలాగే అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పరోక్షంగా మూడు రాజధానుల అవసరం ఉందని స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం విజయవాడలోని APSRTC కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన హైపవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించారు మంత్రి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలి? అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలి? అనే అంశాలపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, బీసీజీ నివేదిపై సుదీర్ఘంగా చర్చించామని బుగ్గన తెలిపారు.
ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని.. కమిటీలు ఇచ్చిన నివేదికలు విశ్లేషించుకొని ముందుకు వెళ్లేందుకే ఈ హైపర్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారని వెల్లడించారు.
సుదీర్ఘంగా 4 గంటల పాటు సాగిన హైపవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. తామిచ్చిన నివేదికల సారాంశాన్ని జీఎన్ రావు, బీసీజీ ప్రతినిధులు హైపవర్ కమిటీకి వివరించారు. విశాఖ నగరాన్నే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారని ఈ సందర్భంగా మంత్రులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించలేదనే విషయాన్ని తమ అధ్యయనంలో వెల్లడైందని వారు చెప్పారు. ఏపీలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధికి చోదక శక్తి అవుతుందని మంత్రుల అభిప్రాయపడ్డారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని హైపర్ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని.. రైతుల ముందు రెండు-మూడు ఆప్షన్లను ఉంచాలని భావిస్తోంది. ప్రతి జిల్లాలోనూ కీలక ప్రాజెక్టులు... చేపట్టాల్సిన అభివృద్ది పనులపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది.
త్వరలో హైపవర్ కమిటీ మరో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత,పేర్ని వెంకటరామయ్య, మేకపాటి గౌతంరెడ్డి,కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, హైపవర్ కమిటీ ఉన్నతాధికారులు, జీఎన్ రావు కమిటీ సభ్యులు, బీసీజీ కమిటీ సభ్యులు హాజరయ్యారు.