Jagananna Smart Town applicable for govt employees also
Jagananna Smart Town ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే.ఆదాయ ధృవీకరణ కొరకు ఫారమ్ 16 సమర్పించాలి
ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే.ఆదాయ ధృవీకరణ కొరకు ఫారమ్ 16 సమర్పించాలి
సొంతింటి కలను సకారం చేసే దిశగా 'జగనన్న స్మార్ట్ టౌన్' పేరుతో ఇళ్ల స్థలాలను మంజూరు చేసే సదవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ "ప్రసన్న వెంకటేష్"సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. నగరపాలక సంస్థ పరిధి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసి సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలను అందిస్తామన్నారు. ఈ స్మార్ట్ టౌన్ పరిధిలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందుకుగాను ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు.
కమ్యూనిటీ హాలు, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంక్, వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం తదితరాల వాటికి స్థలం కేటాయిస్తామన్నారు. నీటి సరఫరా, ఓవర్హెడ్ ట్యాంక్, విద్యుత్ సబ్స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానెల్స్ వంటి సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. మూడు లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులేనన్నారు. 150 చదరపు గజాలకు (మూడు సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.3 లక్షల నుండి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు (4 సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, 240 చదరపు గజాలకు (ఐదు సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.12 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది ఈనెల 6,7 తేదీల్లో డిమాండ్ సర్వే నిర్వహిస్తున్నందున అర్హులైన నగర వాసులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.