మహిళల కోసం ఇప్పటికే అనేక పథకాలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉన్న మహిళలు మొబైల్ ఫోన్ కొన్నవారికి.. 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ కానుకను ప్రకటించారు. అయితే దానికి ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్ ఫోన్ కొని.. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారికి మాత్రమే ఈ 10 శాతం ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అంగన్వాడీల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో 2000 స్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. యాప్ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 154 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని వెల్లడించారు.మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్లు వ్యవస్థను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళా భద్రత, సాధికారితపై షార్ట్ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్ డే ఆఫ్గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్ఎల్ఎల్ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.
పదో తరగతి పూర్తిచేసిన బాలికలకు ప్లస్–1, ప్లస్–2ల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు దిశ పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందులో దిశ యాప్ సహా అన్నిరకాల వివరాలు ఉంచాలని సూచించారు.
మార్చి 20 నుంచి మొదలు కానున్న పుస్తకాల పంపిణీ ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటితోపాటు అంగన్వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ప్రభుత్వం ఇప్పటికే 16పంపిణీ చేసిందని, మిగిలిన 10 బోధనోపకరణాలు నెల రోజుల్లోగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు సీఎం జగన్కు వివరించారు. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.