IRCTC Bus Ticket Booking
ప్రయాణీకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC శుభవార్త అందించింది. ఇప్పటివరకు రైల్వే టికెట్ల బుకింగ్, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన సంస్థ తాజాగా మరో వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించింది.జనవరి 29 నుంచి ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ రూపొందించింది. http://bus.irctc.co.in పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఇకపై రైలు ప్రయాణికులు మాత్రమే కాదు బస్సు ప్రయాణికులు కూడా ఐఆర్సీటీసీ సేవలు పొందొచ్చు. ఐఆర్సీటీసీ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లో బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
"రైల్వే మంత్రిత్వశాఖ, వాణిజ్య మంత్రిత్వశాఖ, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాయకత్వంలో ఐఆర్సీటీసీ క్రమంగా దేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ One Stop Shop Travel Portalను నిలిపే దిశగా ప్రయాణిస్తోంది"అని ఐఆర్సీటీసీ పేర్కొంది.
ఎలా బుక్ చేసుకోవాలంటే
-ఐఆర్సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నవారు ఐఆర్సీటీసీ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ http://bus.irctc.co.inలో టికెట్లు బుక్ చేయొచ్చు.
-ఐఆర్సీటీసీ లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బస్సు టికెట్ బుక్ చేసే సమయంలో ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాలి.
-డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ లాంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ ద్వారా టికెట్లు బుక్ చేయచ్చు.
-ఒకేసారి గరిష్టంగా 6 మంది ప్రయాణికుల పేరు మీద బస్సు టికెట్లు బుక్ చేయొచ్చు.
-ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలో ఎంపిక చేసుకోవాలి, ఆ తర్వాత తేదీని ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
-అనంతరం అందుబాటులో ఉన్న బస్సులను ఎంపిక చేసుకోని.. సీట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
-అనంతరం పేమెంట్ చెల్లించాలి.
-టికెట్లు బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు బస్సుల చిత్రాలను కూడా చూడవచ్చు.
-ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ ద్వారా ఈ సేవ యొక్క ఏకీకరణ మార్చి మొదటివారంలో పూర్తి అవుతోంది. ఇది ప్రజలకు మొబైల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.