బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని పాఠశాలలన్నీ డిసెంబరు 31 వరకు మూసివేయనున్నట్లు నగర మేయర్ కిశోరీ పెడ్ణేకర్ ప్రకటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలుత ప్రకటించినట్లుగా నవంబరు 23న స్కూళ్లు తెరవాల్సి ఉండగా.. కొవిడ్ వ్యాప్తి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం నగర పరిధిలో 924 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వారంలో ఒక రోజు వ్యవధిలో నమోదైన కేసులు ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,72,449కి చేరింది. నిన్న మరో 12 మంది మరణించడంతో మృతుల సంఖ్య 10,624కు చేరింది.
ఇక దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం నాటికి రాష్ట్రంలో 17,63,055 కేసులు నమోదయ్యాయి. వీరిలో 16,35,971 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజు 5,535 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక కొత్తగా 154 మంది మరణించడంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 46,356కు పెరిగింది.