Read also:
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరు అనర్హులు.
జెడ్పీటీసీగా పోటీచేసే వారు రూ.5వేలు డిపాజిట్గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు రూ.2,500 చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్గా చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. అలాగే, ఎవరెవరు పోటీ చేయడానికి అనర్హులో కూడా తెలియజేసింది. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే పోటీచేసే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు. జడ్పీటీసీగా పోటీ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయడానికి వీలులేదు. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేయదలచిన వారు తమ నామినేషన్ల సెట్లను నాలుగు సెట్లకు మించి దాఖలు చేయడానికి అవకాశం లేదు.
గ్రామ సేవకులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్లర్లు పోటీ చేసేందుకు అవకాశం లేదు. అలాగే లంచాలు, అవినీతి కేసుల అభియోగంలో ఉన్నవారు, విధుల నుంచి తప్పించిన ఉద్యోగులు ఐదేండ్ల కాలపరిమితి వరకు పోటీచేసే అవకాశం లేదు. వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేండ్ల తరువాతే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందుతారు. అంతే కాకుండా మానసిక స్థితి సరిగ్గా లేనివారు అనర్హులే. అదే విధంగా 1995 మే 31 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియపరిచే ధ్రువపత్రాలపై అర్హులైన గెజిటెడ్ అధికారి చేత సర్టిపై చేయించి తమ నామినేషన్ పత్రంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. అలాగే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులుగా పోటీ చేయదలచిన వారు ఆయా పార్టీల బీ ఫారం తప్పనిసరిగా సమర్పించాలి.