Read also:
పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యావిధానం-2020 నివేదిక సూచించింది. పాఠశాల, ఉన్నతవిద్య ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను 60 పేజీల నివేదిక పేర్కొంది. పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
5+3+3+4 విధానం
పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలి. ఐదేళ్లలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6-8 తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత, బృందంగా, పరస్పర సహకార విధానం బోధించాలి.
2035 నాటికి 100 శాతం ప్రవేశాలు
ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి 6-8 తరగతుల్లో 90.7%, 9-10లో 79.3%, 11-12 తరగతుల్లో 51.3%. ఈ గణాంకాల ప్రకారం ఎనిమిదో తరగతి తర్వాత బడి మానేస్తున్న వారి సంఖ్య అధికం. వీరిని మళ్లీ బడికి తీసుకొచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. పూర్వప్రాథమిక విద్యలో 2035 నాటికి 100% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలి.
నాలుగేళ్ల డిగ్రీలో వెసులుబాటు
- ఉన్నత విద్యాసంస్థలు నాలుగేళ్ల డిగ్రీలను ఆహ్వానించాలని సూచించింది. విద్యార్థులు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. మొదటి ఏడాది వెళ్లిపోతే డిప్లొమా అర్హత ధ్రువపత్రం, మూడేళ్లకు బయటకు వెళ్తే డిగ్రీ ఇవ్వాలని వెల్లడించింది.
- ఆర్థిక సమస్యలతో ఏ విద్యార్థీ ఉన్నతవిద్యకు దూరం కాకూడదు. జాతీయ ఉపకార వేతనాన్ని మరింత విస్తరించాలి. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఉపకార వేతనాలను అందించాలి. ఉన్నతవిద్యలో ప్రవేశాల నిష్పత్తి 2018లో జాతీయ సరాసరి 26.3% ఉంది. ఇది 2030 నాటికి 50% చేరాలి.
- 2040 నాటికి డిగ్రీ కళాశాలలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా, విశ్వవిద్యాలయాలు... పరిశోధన వర్సిటీలు, బోధన వర్సిటీలుగా మారాలి.
నాణ్యతలేని బీఈడీ విద్యాసంస్థల మూత
- ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలని, నాణ్యతలేని వాటిని వీలైనంతవరకు మూసివేయాలని నివేదిక సూచించింది.
- కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 30:1, సామాజిక వెనుకబడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరి.
- 2030 నాటికి నాలుగేళ్ల సమీకృత డిగ్రీ+ బీఈడీ కోర్సు అర్హతగా ఉండాలి. విద్యా సంస్థలు బహుళ బీఈడీ కోర్సులను నిర్వహించాలి. నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలి. ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ, అంచనా, అక్రిడిటేషన్ అవసరం. వెనుకబడిన, అణగారిన వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన పూర్వప్రాథమిక విద్యను అందించాలి. జాతీయ ఓపెన్ స్కూల్(ఎన్ఐవోఎస్)లో సార్వత్రిక, దూరవిద్య కోర్సులను మరింత పెంచాలి.