Read also:
ఫీజుల నియంత్రణకు టోల్ ఫ్రీ నెంబర్
టీచర్లు బోధనకే పరిమితం
విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
విద్యాశాఖ అధికారులకు సిఎం ఆదేశం
ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రించేందుకు టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు షాక్ కొట్టే రీతిలో ఉన్నాయని, ఫీజులు వెంటనే తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు కళా శాలలు, పాఠశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షా నిర్వహించారు.
నాణ్యమైన విద్య, పాఠ్యప్రణాళికలో నాణ్యత, ఫీజులు తగ్గింపు ఈ మూడు విషయాల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన డబ్బులను సకాలంలో ఇస్తామని, ప్రమాణాలు, నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటే వాటిని ప్రచారం చేయాలని సిఎం ఆదేశించారు. దీనివల్ల ఇతరులు తప్పులు చేయకుండా ఉంటారని తెలిపారు. ప్రీప్రైమరీ విద్యపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని దీనికోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని చెప్పారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు తల్లిదండ్రుల కమిటీలను పిలిపించి అమ్మఒడిని ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ప్రజలు నాణ్యమైన విద్యను ఆశిస్తున్నారని, పాఠ్యప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం చదువుల కోసం విపరీతంగా ఖర్చుపెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మీడియంలోనే ఉన్నాయని తెలిపారు.
పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిని తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఇంగ్లీషు మీడియాన్ని పేదవాళ్ల దగ్గరకు తీసు కెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే దానిపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పిస్తున్నా మంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎపి పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు, ఎపి ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.