Read also:
మళ్లీ దిగిన బంగారం ధర.. పది గ్రాములకు ఎంత తగ్గిందంటే
గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టి హడలెత్తించిన బంగారం ధరలు.. గత మూడునాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం మరింత తగ్గాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.300 తగ్గి రూ.39,22కు పడిపోయింది. రూపాయి బలోపేతం కావడం, డిమాండ్ తగ్గడమే బంగారం ధర తగ్గుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, బంగారం పతనంతో వెండి కూడా గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. వెండి కిలోకు రూ.1400 తగ్గి రూ.48,500కు తగ్గింది.
పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధర క్షీణించింది. రూపాయి బలోపేతం కావడంతోపాటు బంగారం ధర అధికంగా ఉండడంతో మార్కెట్లో పండుగ డిమాండ్ రావడం లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు. మరోవైపు, సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి 14 పైసలు పెరిగి 71.58 రూపాయలకు చేరుకుంది. ఇక, న్యూయార్క్లో సోమవారం ఔన్సు బంగారం ధర 1506 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 18.05 డాలర్లుగా నమోదైంది.