ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడంలో ఇబ్బందులు తొలగించాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. ఇందులో లోపాలు సవరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడుకు ఫ్యాప్టో చైర్మన్ జివి నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ కె. నరహరి శనివారం లేఖ రాశారు. బయోమెట్రిక్ తో ఉపాధ్యాయులు మానసికంగా ఆందోళన పడుతున్నారని తెలిపారు. పాఠశాలకు సకాలంలో హాజరైనా బయోమెట్రిక్ డివైజ్ ఆధార్ ఆధారిత గుర్తింపు కోసం గంటల తరబడి పలుమార్లు నమోదు అడుగుతోందని తెలిపారు చాలా సందర్భాల్లో హాజరు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. కొన్ని పాఠశా లలకు నెట్వర్క్ పూర్తిగా ఉండడం లేదని వివరించారు. అధికారులు సర్వర్, నెట్ వర్క్ లకు సంబంధం లేకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారిందని ఉపాధ్యాయులను నిత్యం ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచాలని, మొదటి ప్రయత్నంలోనే హాజరు నమోదు అయ్యేలా చేయాలని కోరారు. యాప్ పనిచేయని రోజున ఎంఆర్ సి ద్వారా మాన్యువల్ హాజరు సేకరించాలని సూచించారు. నెట్వర్క్ లేని పాఠశాలలకు ప్రత్యామ్నాయ విధానాలు పాటించాలని కోరారు. బయోమెట్రిక్ హాజరు నమోదు వల్ల బోధనకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.