Saturday, March 6, 2021

వార్డు వాలంటీర్లను ఆదేశించిన హైకోర్టు



Read also:

  • సెల్‌ఫోన్లు అప్పగించేయండి
  • వార్డు వాలంటీర్లను ఆదేశించిన హైకోర్టు
  • ఎస్‌ఈసీ అత్యవసర అప్పీల్‌పై ఇంటి వద్ద విచారణ జరిపిన ధర్మాసనం

మున్సిపల్‌ కమిషనర్లు నియమించిన అధికారుల వద్ద ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ఫోన్లను అప్పగించాలని వార్డు వాలంటీర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సాధారణ విధి నిర్వహణలో భాగంగా ఫోన్లు అవసరమైతే... ఆ కారణాలను వివరించి సంబంధిత అధికారి పర్యవేక్షణలోనే వినియోగించుకోవచ్చని సూచించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడే వాలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సిఫారసు చేసేందుకు ఎస్‌ఈసీకి వెసులుబాటు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ అంగీకారం మేరకు ఈ ఆదేశాలిచ్చింది. ఎస్‌ఈసీ ఆదేశాల అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఎస్‌ఈసీ అత్యవసరంగా దాఖలు చేసిన హౌజ్‌మోషన్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పురపాలక ఎన్నికల్లో వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ... అధికారిక ఫోన్లలోని డేటాను దుర్వినియోగం చేస్తున్నారని అందిన ఫిర్యాదుల ఆధారంగా వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలంటూ ఫిబ్రవరి 28న ఎస్‌ఈసీ కలెక్టర్లను ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ ఆదేశాల అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఈనెల 3న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై ఎస్‌ఈసీ శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా అప్పీల్‌ చేసింది.

భారీగా ఫిర్యాదులు అందాయి: ఎస్‌ఈసీ

ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ... ‘పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల తీరుపై భారీగా ఫిర్యాదులు అందాయి. అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో వివిధ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం ఉంది. ఆ డేటాను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 68,913 మంది వాలంటీర్లు ఉన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా డేటాను దుర్వినియోగం చేయకుండా ఉంచేందుకు ఫోన్లను అప్పగించాలని ఆదేశించాం’ అని వివరించారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వం తరఫు ఏజీ ఎస్‌.శ్రీరామ్‌, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది పరస్పర అంగీకారం మేరకు ఏ అధికారి వద్ద ఫోన్లను ఉంచితే ఉత్తమమో తెలపాలని కోరింది. ఇరువైపుల న్యాయవాదుల అభిప్రాయం తర్వాత... మున్సిపల్‌ కమిషనర్లు నామినేట్‌ చేసిన అధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని ధర్మాసనం నిర్ణయించింది. వాలంటీర్లు ఫోన్లను వినియోగించకుండా పూర్తిగా నిలువరించడం సరికాదని అభిప్రాయపడింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :