Read also:
Andhra Pradesh: వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ వెల్లడించారు.
రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిలవాలని.వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్ అన్నారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ప్రతి పోలీస్స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారలను ముఖ్యమంత్రి ఆదేశించారు. దిశ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని అన్నారు. 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దిశ చట్టం కింద 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1080కేసులకు సంబంధించి 15 రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశామని, అందులో 103 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామని అధికారులు వివరించారు. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాలని సూచించారు.
దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు దిశ యాప్పై అవగాహన కల్పించాలని నిర్దేశించారు.
గ్రామ సచివాలయాల్లో దిశ చట్టం కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్ ఉండాలని ఆదేశించారు. దిశ ఎస్ఓఎస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా.లేదా అని సీఎం ప్రశ్నించగా.సగటున 6 నిమిషాల్లోగా చేసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్ వెళ్లాలని, వారి సమస్య తీరిందా.లేదా.అన్న దానిపై తప్పని సరిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు.