కరోనా మహమ్మారి దాదాపుగా తగ్గింది. దేశమంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తప్పితే మిగతా అన్ని చోట్లా అంతా బాగుంది. అందుకే ఎప్పటిలాగే స్కూళ్లు, కాలేజీలు నడుస్తున్నాయి. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్గా మారింది. ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారంటూ.ఏపీ ప్రభుత్వ జీవో పేరిట ఓ ఫొటో రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని స్కూళ్లు, కాలేజీలకు మార్చి 1 నుంచి మే 4 వరకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఈ జోవోను అన్ని విద్యాసంస్థలకు పంపించారు. అందరూ దీన్ని పాటించాలి.అని ఆ సందేశం సారాంశం. ఐతే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పక్కా ఫేక్ న్యూస్. ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించలేదు. తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే సంబంధిత మంత్రిగానీ, ఆశాఖ అధికారులు కూడా అధికారింగా ప్రకటిస్తారు. అంతేతప్ప సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మకూడదు.
ఇది ఫేక్ న్యూస్
పై ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అందులోని కొన్ని పదాల స్పెల్లింగ్ కూడా సరిగా లేదు. ప్రభుత్వ జీవో ఈ ఫార్మట్లో అస్సలు ఉండదు. ఏ ప్రభుత్వమూ ఇంత గుడ్డిగా జీవోలు జారీచేయవన్న విషయాన్ని గుర్తించుకోండి.
ఫేస్బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. వాట్సప్కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. గుడ్డిగా ఫార్వర్డ్ చేసి చిక్కుల్లోపడుతున్నారు. అందుకే వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తనూ నమ్మవద్దు. ఇతర మీడియా విభాగాల్లో చెక్ చేసిన తర్వాతే ధృవీకరించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అసలే సోషల్ మీడియాపై కేంద్రం కఠినమైన నిబంధనలను తెచ్చింది.