AP Municipal Elections: వైసీపీ సహా రాజకీయ పార్టీలకు గోల్డెన్ చాన్స్.. వారం రోజులు చాన్స్
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలకు ఓ అవకాశం కల్పించారు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. 2020 మార్చిలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి, ఆ తర్వాత చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించారు. ఏడురోజుల లోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 56 మంది మృతి చెందినట్టు ఎస్ఈసి జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. వారిలో వైసీపీ - 28, టీడీపీ - 17, బీజేపీ - 5, సీపీఐ - 3, కాంగ్రెస్ - 2, జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేసిన తర్వాత చనిపోయారు. దీంతో ఆయా పార్టీలకు చెందిన వారు మరోసారి నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2వ తేదీవరకు నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 3వ తేదీ వరకు పరిశీలన ఉంటుందని.. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ తో పాటు ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటించారు. ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రకటన మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. మొదటి నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేసే డిమాండ్లలో మొదటి అంశం ఏంటంటే.. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన అభ్యర్థులు చనిపోయారని వాదించాయి. మరోవైపు అధికార వైసీపీ బలవంతంగా కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేయించిందని, మళ్లీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఏకగ్రీవాలకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఏకగ్రీవాల మీద విచారణ అవసరం లేదని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది.
రేపు నాలుగో విడుత పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ఉంటుంది. నాలుగో విడత 13 జిల్లాలలో 161 మండలాలలోని 3, 299 పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 553 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,744 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 7,475 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 33,435 వార్డుల్లో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22,422 వార్డులకు 49,083 మంది పోటీలో ఉన్నారు. 16 రెవెన్యూ డివిజన్లలో మొత్తం 67, 75,226 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.