ప్రతి విద్యార్థి తనలోని సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలంటే తప్పనిసరిగా పుస్తక పఠనం చేయాల్సిందేనని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకే ‘మేము పఠనాన్ని ప్రేమిస్తున్నాం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆదివారం విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని చిత్తరంజన్ గ్రంథాలయంలో..ఆయన గీతాంజలి గ్రంథంలోని రెండు సూక్తులను చదివి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికశాతం విద్యార్థులు అక్షరాలను పదాలుగా, పదాలను వాక్యాలుగా గుర్తించలేకపోతున్నారన్నారు. ఎక్కువ శాతం పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థుల్లో కనీసం 4వ తరగతిలో ఉండాల్సిన సామర్థ.్యం కనిపించలేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు, అన్ని గ్రంథాలయాల్లోనూ పుస్తకపఠనం తప్పనిసరి చేశామన్నారు. విద్యార్థి వయసుకు తగ్గ సామర్థ్యాలు ఉండేలా ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యావ్యవస్థ.కు పాఠశాలలు, గ్రంథాలయాలు రెండు కళ్లు వంటివన్నారు. విద్యార్థులచే పుస్తకాలు చదివించి వారి సామర్థా.్యలను పరిశీలించారు. రాష్ట్ర సమగ్ర శిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భాషా నైపుణ్యంలో పుస్తక పఠనం ఒకటన్నారు. విద్యార్థి. ఉన్నత స్థా.యికి ఎదగాలంటే తరగతి పుస్తకాలతోపాటు ఇతర మంచి పుస్తకాలన్నిటినీ చదవాలన్నారు. ‘నేటి పాఠకుడే, రేపటి నాయకుడు’ అనే ఆంగ్ల సామెతను ఉదహరించారు. రాష్ట్ర గ్రంథాలయశాఖ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లోని గ్రంథాలయాలతోపాటు అన్ని శాఖా గ్రంథాలయాలు, గ్రామీణ గ్రంథాలయాలు, కుగ్రామాల్లోని పుస్తక నిక్షేప కేంద్రాల్లో ప్రతి ఆదివారం పాఠశాల విద్యార్థు.లచే పుస్తక పఠనం చేయించమని సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మస్తానయ్య, విద్యాశాఖాధికారిణి రాజ్యలక్ష్మి, ఉపవిద్యాశాఖాధికార్లు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ. కార్యదర్శి నాగరాజు, ఉద్యోగసంఘ నాయకులు మధుసూదనరాజు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.