ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ తమకు ఆసక్తి ఉన్న కెరీర్ను ఎంచుకునేందుకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ వెబ్సైట్ను తీసుకొచ్చింది.
ఆసక్తి ఉన్న వృత్తుల గురించి పిల్లలు తెలుసుకుని అందుకు కృషి చేసేందుకు యునిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో.. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. విద్యార్థులు తమ గుర్తింపు సంఖ్య, పాస్వర్డ్లతో వెబ్సైట్లోకి వెళ్లి వారికి కావాల్సిన కెరీర్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ వెబ్సైట్లో 555పైగా కెరీర్లు, 21వేల కళాశాలల వివరాలు, 1,150 ప్రవేశ పరీక్షల సమాచారం, 1,500కుపైగా ఉపకార వేతనాల వివరాలను పొందుపరిచారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకునేందుకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తారు.
క్షేత్రస్థాయి ప్రాజెక్ట్ వర్క్:
పదో తరగతి విద్యార్థులకు కెరీర్ మార్గదర్శనం కోసం ప్రత్యేక క్షేత్రస్థాయి ప్రాజెక్టును అకడమిక్ కేలండర్లో పొందుపరిచారు. విద్యార్థులు తమకు సమీప ప్రాంతాల్లో వివిధ వృత్తుల వారిని కలిసి వారి నుంచి కొంత సమాచారం సేకరించి ప్రాజెక్టు వర్క్ తయారుచేయాల్సి ఉంటుంది. ఆయా వృత్తుల్లోకి ఎందుకు.. ఎలా వచ్చారు? ఆదాయం కుటుంబ పోషణకు సరిపోతుందా? తదితర వివరాలను సేకరించాలి. ఫలితంగా విద్యార్థులకు ఆయా వృత్తులపై అవగాహన కలుగుతుందనేదే ముఖ్య ఉద్దేశం.