మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే అలర్ట్. ఇకపై బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పటికే పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు డెడ్లైన్స్ కూడా పొడిగించింది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లకు కూడా ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేస్తోంది. అంతేకాదు... రూపే కార్డును మొదటి ఆప్షన్ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుల్ని ఆదేశించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 73వ యాన్యువల్ జనరల్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... కస్టమర్లకు బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుల విషయంలో రూపే ప్లాట్ఫామ్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
దీంతో పాటు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని ఆదేశించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI సంస్థను బ్రాండ్ ఇండియా ప్రొడక్ట్గా మార్చాలని కోరింది.
డిసెంబర్ 31 నాటికి అన్ని బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్తో పాటు పాన్ నెంబర్ లింక్ అయి ఉండాలని బ్యాంకర్లకు ఆదేశించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్వెరిఫైడ్ అకౌంట్ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదన్నారు. అయితే డిసెంబర్ 31 అంటే ఎక్కువ రోజులు లేదు. 50 రోజుల్లోపే గడువుంది. ఒకవేళ బ్యాంకర్లు కోరితే మార్చి వరకు గడువును పొడిగించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ చేయని బ్యాంక్ అకౌంట్లు పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారందరూ తమ అకౌంట్లకు ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే బ్యాంకుకు వెళ్లి లేదా బ్యాంక్ వెబ్సైట్లో ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ చేయాలి.
ఇక బ్యాంకర్లు నాన్ డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించకూడదని, యూపీఐ పేమెంట్స్ని ప్రోత్సహించాలని బ్యాంకర్స్కు సూచించింది నిర్మలా సీతారామన్. ప్రతీ కస్టమర్, అన్ని వర్గాలకు చెందినవారు బ్యాంకులో ప్రతీ సేవను డిజిటల్ పద్ధతిలో పొందాలని తెలిపారు.