ఇటీవలి కాలంలో ఆన్లైన్ షాపింగ్కు వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కామారెడ్డి ఎస్పీ ఎన్ శ్వేత సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "జిల్లాలో మర్నూర్ మండలానికి చెందిన ఓ మహిళ ఇటీవల నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఎన్ని రోజులైనా వస్త్రాలు ఇంటికి రాకపోవడంతో కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన వ్యక్తి సైబర్ నేరస్థుడని గ్రహించలేక అతను చెప్పిన విధంగా చేయడంతో సదరు మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 42,500 మాయమయ్యాయి. దీంతో ఆమె మోసపోయినట్టు గ్రహించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది" అని ఎస్పీ తెలిపారు.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగి పోతున్న కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్ వివరాలు, ఓటీపీ, ఇతర వివరాలు అడినప్పుడు ఇవ్వకూడదని అన్నారు. ఫోన్లలో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పినా నమ్మవద్దన్నారు. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఇక, ఫెస్టివల్ సీజన్ ఆసరాగా చేసుకుని కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఫేక్ వెబ్సైట్లు సృష్టించి డిస్కౌంట్ల పేరిట వినియోగదారులను బురిడి కొట్టంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారులు చెప్పిన సూచనలు పాటించడంతో పాటుగా.. జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది. అలాగే తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. వారికి బ్యాంక్ వివరాలతోపాటుగా, వ్యక్తిగత వివరాలు చెప్పకుండా ఉండాలి.