Read also:
సంక్షిప్త సందేశాలతో సైబర్ నేరస్థుల వలవయోజనులు, మహిళలపై గురిఖాతాల్లోంచి లక్షల్లో నగదు మాయంఆంధ్రా బ్యాంక్ ఖాతాదారులే లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: 'మీరు ఫలానా ఏటీఎం నుంచి రూ.20వేల నగదు విత్డ్రా చేసుకున్నారు.. అలా తీసుకుంది మీరు కాదంటే వెంటనే ఈ నంబర్కు ఫోన్ చేయండి.. మీ సొమ్ము మీ ఖాతాల్లో జమచేస్తాం' అంటూ.బ్యాంకుల పేరుతో సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు తెరలేపారు. ప్రధానంగా ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని వారి చరవాణులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు.ఇలా 20 రోజుల నుంచి కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరస్థుల మాటలు నమ్మిన బాధితులు రూ.లక్షల్లో నగదు పోగొట్టుకున్నారు.బ్యాంక్ అధికారులను సంప్రదించి, మోసాన్ని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని కేటుగాళ్లు ఈ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి సంక్షిప్త సందేశాలు వస్తే వెంటనే బ్యాంక్ అధికారులు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
దగా చేసేదిలా
- ఆంధ్రాబ్యాంక్లో అంతర్జాల ఆధారిత బ్యాంక్ ఖాతాలున్న వారి వివరాలను సైబర్ నేరస్థులు పొరుగుసేవల విభాగం వారికి డబ్బు ఆశజూపి సేకరిస్తున్నారు. ఖాతాదారుల ఫోన్ నంబర్లను తీసుకుని రోజుకు 200 మంది సెల్ఫోన్లకు ఆంధ్రాబ్యాంక్ నుంచి పంపినట్టే సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ పేరు స్ఫురించేలా గంపగుత్త సంక్షిప్త సందేశాల పేరునూ సైబర్ నేరస్థులు సెల్ఫోన్ నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా ముందే తీసుకుంటున్నారు.
- మీరు 20వేల నగదు విత్డ్రా చేసుకున్నారు. మీరు సొమ్ము తీసుకోకుంటే 9298112345 నంబర్కు సంక్షిప్త సందేశం పంపించండి.. మీ కార్డు బ్లాక్ చేసేందుకు వెంటనే 7679751875కు ఫోన్ చేయండి.. ఆంధ్రాబ్యాంక్'' అంటూ సంక్షిప్త సందేశం పంపుతున్నారు.
- తాము సూచించిన ఫోన్ నంబర్లకు బాధితులు ఫోన్ చేసిన వెంటనే సైబర్ నేరస్థులు స్పందిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుల వివరాలు తెలుసుకున్న నేరస్థులు అచ్చం బ్యాంక్ అధికారుల్లా మాట్లాడుతున్నారు.
- మీ సెల్ఫోన్కు మేం పంపిన లింక్ను తెరిచి వివరాలు నమోదు చేస్తే చాలు... అరగంటలో మీ ఖాతాలో నగదు జమవుతుందని చెబుతున్నారు. నేరస్థులు పంపిన లింక్లో బాధితుడి అంతర్జాల ఆధారిత ఖాతాకు సంబంధించిన యూపీఐ (యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) నంబరు ఉంటుంది.
- యూపీఐ ఆధారంగా బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని రూ.లక్షలను సైబర్ నేరస్థులు తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. బాధితులు తమ ఖాతాల్లో నగదు పోయిందని గ్రహించి మాట్లాడేలోపు నేరస్థులు తమ ఫోన్ నంబర్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.
సత్వరం స్పందిస్తారన్న అంచనాతో
అంతర్జాల ఆధారిత ఖాతాలు, వారి ఫోన్ నంబర్లను తెలుసుకున్న తర్వాత సైబర్ నేరస్థులు మహిళలు, వయోజనులను లక్ష్యంగా చేసుకుని వారి సెల్ఫోన్లకు మాత్రమే సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. వీరైతే సంక్షిప్త సందేశాలు వచ్చిన వెంటనే స్పందిస్తారన్న అంచనాతో ఇలా చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇరవై రోజుల వ్యవధిలో 18 ఫిర్యాదులు వచ్చాయని, ఒక విశ్రాంత అధికారి ఖాతా నుంచి రూ.4.5లక్షల నగదు విత్డ్రా చేసుకున్నారని సైబర్క్రైమ్ పోలీస్ అధికారి ఒకరు వివరించారు