Read also:
ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం శుభవార్త శాలరీపై సరికొత్త నిర్ణయానికి అడుగు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీల్లో అలవెన్సులు ఇంక్లూడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త వేతన స్ట్రక్చర్ను అమలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మినిమే వేజెస్ యాక్ట్ (కనీస వేతన చట్టం) కింద దేశవ్యాప్తంగా ఈ కొత్త శాలరీ స్ట్రక్చర్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
కొత్త వేతన స్ట్రక్చర్
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త వేతన స్ట్రక్చర్, అలవెన్స్ అంశాలపై దృష్టి సారించింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కొన్ని షరతులతో ఇండస్ట్రీ వర్గాలు అలవెన్స్లో కొంత భాగాన్ని బేసిక్ శాలరీలో చేర్చడానికి అంగీకరించారట.
శాలరీ విధానంపై డిమాండ్లు
శాలరీ విధానంపై ట్రేడ్ యూనియన్ల నుంచి ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుతున్నాయి. కంపెనీలు ఉద్యోగుల బేసిక్ శాలరీని తక్కువగా చూపిస్తున్నాయని, దీంతో కంపెనీలకు ప్రయోజనం లభిస్తోందని చెబుతున్నాయి. తక్కువ బేసిక్ వల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా తగ్గుతోందని అంటున్నారు. దీంతో పీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే మొత్తం కూడా తగ్గుతోందని చెబుతున్నారు.
నెలకు వచ్చే వేతనం తగ్గొచ్చు.
కొత్త రూల్స్ ప్రకారం అలవెన్సులు ఉద్యోగి బేసిక్ శాలరీ పరిధిలోకి వస్తాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్లో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం. అయితే ఇరువైపుల నుంచి పీఎఫ్ కట్ అవుతుంది కాబట్టి నెలకు వచ్చే వేతనంలో కొంత తగ్గుదల ఉండవచ్చు. ఉద్యోగికి ఇది ప్రయోజనం. ఉద్యోగుల పీఎఫ్ మొత్తం ఎక్కువగా వస్తుంది.
అన్ని రంగాల్లో ఒకేసారి...
వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు కేంద్రం కొత్త రూల్స్ పైన సంప్రదించాయని తెలుస్తోంది. బేసిక్ శాలరీకి ఎలాంటి అలవెన్సులు జత చేయాలో పరిశ్రమ ప్రాతిపదికన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని కంపెనీలు కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. అన్ని రంగాల్లోను ఒకేసారీ ఈ కొత్త వేతన స్ట్రక్చర్ అమలు చేయాలని పరిశ్రమ కోరుకుంటోంది.