AP Local Body Elections: ఏపీలో హీటెక్కిస్తున్న లోకల్ వార్... హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మళ్లీ తారాస్థాయికి చేరింది. పరిషత్ ఎన్నికలకు మరో 48 గంటలే సమయం ఉన్న నేపథ్యంలో హైకోర్టు స్టే ఇవ్వడం సంచలనంగా మారింది. ఎన్నికలపై స్టే ఇస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ కు వెళ్లింది. దీంతో ప్రజాక్షేత్రంలం జరగాల్సిన యుద్ధం.కోర్టుకు మారింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని.ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరముందని ప్రభుత్వం పేర్కొంది. పిటిషన్ పై వెంటనే విచారణ జరిపి ఎన్నికల నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. దీంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు హాట్ టాపిక్ అయింది. ఎస్ఈసీతో పాటు ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్నికలకు అనకూలంగా డివిజనల్ బెంచ్ తీర్పు ఇస్తుందని ఆశాభావంతో ఉంది. ఎన్నికల కోడ్ విషయంలో నాలుగు వారాల సమయం ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని ఎస్ఈసీ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా ఎన్నికలను నిలిపేయాలంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసింది. ఐతే టీడీపీ పిటిషన్ ను విచారించిన అనంతరం ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన కోర్టు.. అదే రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎల్లుండి 516 జెడ్పీటీసీ 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉండగా హైకోర్టు స్టే ఆదేశాలతో చివరి నిముషంలో బ్రేక్ పడింది.
పొలిటికల్ వార్
ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా.. అధికార పార్టీ నేతలు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. డివినల్ బెంచ్ లో ఎన్నికలకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వాగతించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయమన్నారు. చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని.. ఈ చట్టవిరుద్ద ఎన్నికలను బహిష్కరించడం సరైందని మరోసారి రుజువైందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి, అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని స్వీకరించి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలను ప్రారంభిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన వైసీపీ నేతలు ఎన్నికలంటే పారిపోయిన వ్యక్తి.. ఎన్నికలు నిలిపేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనె త్వరగతిన ఎన్నికలు నిర్వహించాలని తాము భావిస్తున్నామని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి ,జనసేన లు ఎన్నికలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.