ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గురువారం పదవి విరమణ చేయనున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామన్నారు. తన సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు.
వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయని, ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెళ్లమన్నారని.దీన్ని వెంటనే చక్కదిద్దామన్నారు. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడం టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు.
ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు.
ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలన్నారు.
వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు మీడియా అందించిన సహకారానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.