SBI | భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు, రేపు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని ఎస్బీఐ ప్రకటించింది
1. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉందా? ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు జరపాలా? అయితే అలర్ట్. బ్యాంకింగ్ సేవలకు రెండు రోజులు అంతరాయం ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది
2. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమ్మె కొనసాగుతోంది. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా బ్యాంకుల్లో కార్యకలాపాలకు అంతరాయం తప్పదు.
3. బ్యాంకుల్లో యథావిధిగా సేవలు లభించేది మార్చి 17 నుంచే. కాబట్టి ఖాతాదారులు, బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలనుకునేవారు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అవసరం.
4. ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. బ్యాంకుల్లో కార్యకలాపాలు, ఏటీఎం సెంటర్లలో నగదు కొరత లాంటి సమస్యలు ఉండొచ్చు.
5. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU ఆధ్వర్యంలోనే తొమ్మిది యూనియన్లు సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA తెలిపింది.
6. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-NCBE, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కెనెరా బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్-INBEF, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్-NOBW, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO, ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ కెనెరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AINBOF పాల్గొంటాయి.
7. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనను బ్యాంకు యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే సమ్మెను నిర్వహిస్తున్నాయి.
8. ఇక ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో మెజార్టీ వాటాను 2019లో ఎల్ఐసీ చేజిక్కించుకుంది. గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనమయ్యాయి. మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.