AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం... సీఎం జగన్ అనుకున్నట్టు కొత్త జిల్లాలు ఏర్పడాలంటే
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021 జనాభా లెక్కలు ఇంకా పూర్తి కాకపోవడం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు బయటికొచ్చాయి. జనాభా లెక్కలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దరఖాస్తుకు సమాధానం రావడంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు పంపింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ కరోనా కారణంగా నిలిచిపోయింది. దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. ఏపీలో ఇటీవల వెల్లడైన పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఫలితాలు వైసీపీకి పూర్తి అనుకూలంగా రావడంతో రేపోమాపో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేయనుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ఇచ్చిన ట్విస్ట్ ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చింది. జనాభా లెక్కలు తేలే వరకూ సరిహద్దులు మారకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ తరుణంలో ఇంటింటికీ వెళ్లి జనగణన చేయడం ఇప్పట్లో సాధ్యం కాని పని.
కరోనా కేసులు తగ్గి జనగణన మొదలైనా ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టే అవకాశముంది. అప్పటివరకూ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు లేనట్టేనని తేలిపోయింది. ఏపీలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలుకు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రతిపాదిత నివేదికను కూడా రూపొందించింది. పార్లమెంట్ నియోజవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మొత్తం 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది.