ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వింత వ్యాధి కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గుడివాడలోని ఆర్సీఎం మిషనరీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు కళ్లు తిరిగిపడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా దాదాపు పదిమంది విద్యార్థులు క్లాస్ రూములోనే కుప్పకూలిపోయారు. దీంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం స్టూడెంట్స్ ని ఆస్పత్రికి తరలించింది. బాధిత విద్యార్థులంతా 1,2 తరగతులు చదువుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకు స్పందిచలేదు. విద్యార్థులు కళ్లు తిరిగిపడిపోయారని. ప్రస్తుతం వారు మైకంలోనే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అందరికీ సెలైన్ ఎక్కిస్తూ డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచారు. ఓ విద్యార్థి స్పృహలోకి వచ్చి ఎవరో ట్యాబ్లెట్లు ఇచ్చారని. అవి తీసుకున్నవెంటనే పడిపోయినట్లు వివరించినట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులు కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నారు.
విద్యార్థులు ఇళ్లలో టిఫిన్ చేసి స్కూలుకు వచ్చారని. పైగా స్కూల్లో కూడా లంచ్ కి ముందే ఇలా జరిగిందని. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశమే లేదని టీచర్లు చెప్తున్నారు. ఆస్పత్రిలోనే ఉలిక్కిపడి లేవడం, కేకలు వేయడం చేస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలపై డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. విద్యార్థులు కోలుకోని అసలు విషయం చెప్తేగానీ మిస్టరీ వీడే అవకాశం లేదు. ఓవైపు కరోనా భయం కూడా తల్లిదండ్రులను వెంటాడుతోంది. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి కొడాలి నాని. హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్, ఎస్పీ కూడా ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
గుడివాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
మరోవైపు గుడివార ఆర్సీఎం స్కూల్లో ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్థులకు తక్షణమే వైద్య సాయం అందించాలని కృష్ణా జిల్లా DMHO డాక్టర్ సుహాసినిని ఫోన్లో ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని DMHOని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయం కల్పించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని. ఎలాంటి ఆందోళన లేదని డీఎంహెచ్ఓ మంత్రికి వివరించారు. వేసవి కాలం రావడంతో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండాస్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.