ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించింది. 23 పథకాలకు నెలవారీ షెడ్యూల్ ను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో క్యాలెండర్ ను ఆమోదించారు. మొత్తం 23 పథకాలను నెలవారీగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒకటికి మించి పథకాలను అందిస్తున్నామని.. ప్రభుత్వ పథకాల్లో 8 నుంచి 12 కోట్ల మంది లబ్ధిదారులున్నట్లు తెలిపారు. ఈసారి కొత్తగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రకింటిన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏప్రిల్ 2020: జగనన్న వసతి దీవెన పథకం కింద 15లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు
ఏప్రిల్ 2021: జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు విడతలుగా ( ఏప్రిల్-జూలై-డిసెంబర్-ఫిబ్రవరి) సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు. 18లక్షల 80వేల మందికి లబ్ధి.
ఏప్రిల్ 2021: రైతులకు వడ్డీలేని రుణాలు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 66.11 లక్షల మందికి వడ్డీలేని రుణాలు
ఏప్రిల్ 2021: 90.37లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
మే 2021: పంటల బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు బీమా చెల్లింపు.
మే 2021: రైతు భరోసా పథకం కింద మూడు దఫాలుగా ( మే-అక్టోబర్-జనవరి) 54 లక్షల మందికి రైతులకు లబ్ధి.
మే 2021: మత్స్యకార భరోసా కింద 1.09 లక్షల మందికి ఆర్ధిక సాయం.
మే 2021: లో మత్స్యకార భరోసా పథకం కింద 19వేల పడవలకు డీజిల్ సబ్సిడీ.
జూన్ 2021: జగనన్న విద్యాకానుక పథకం కింద 42 లక్షల మందికి బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ.
జూన్ 2021: వైఎస్ఆర్ చేయూత పథకం కింద 24 లక్షల మందికి రూ.17,250 చొప్పున ఆర్ధిక సాయం.
జూలై 2021: వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పథకం కింద 2 లక్షల మందికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం.
జూలై 2021: వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 3.27లక్షల మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం.
ఆగస్టు 2021: 25 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు.
ఆగస్టు 2021: 9వేల ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు.
ఆగస్టు 2021: నేతన్న నేస్తం పథకం కింద 81వేల మందికి ఆర్ధిక సాయం.
ఆగస్టు 2021: 3లక్షల 34వేల మంది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు.
సెప్టెంబర్ 2021: వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లింపులు.
అక్టోబర్ 2021: జగనన్న తోడు పథకం కింద 9.05లక్షల మందికి సాయం.
అక్టోబర్ 2021: జగనన్న చేదోడు పథకం కింద టైలర్లు, రజకులు, నాయి. బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం.2.95లక్షల మందికి లబ్ధి.
నవంబర్ 2021: అగ్రవర్ణాల పేద మహిళలకు ఈసీబీ నేస్తం పథకం కింద రూ.15వేలు ఆర్ధిక సాయం. 6 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా.
జనవరి 2022: జగనన్న అమ్మఒడి పథకం కింద 44లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం
సంక్షేమ పథకాల క్యాలెండర్లో పేర్కొన్న పథకాలే కాకుండా నెలవారి పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య శ్రీ ఆసరా పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈపథకాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.