ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చివరిదశ పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.89 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగోసారి విడతలోనూ పోలింగ్ 80 శాతానికి పైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85.60 శాతం అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 73.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రి 10గంటల లోపు పూర్తి ఫలితాలను వెల్లడిస్తారు.నాలుగో విడత 13 జిల్లాలలో 161 మండలాలలోని 3, 299 పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 554 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించగా.. మొత్తం 7,475 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 33,435 వార్డుల్లో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22,422 వార్డులకు 49,083 మంది పోటీలో ఉన్నారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే
- శ్రీకాకుళం జిల్లా - 78.81%
- విజయనగరం జిల్లా- 85.60%
- విశాఖపట్నం జిల్లా - 84.07%
- తూర్పుగోదావరి జిల్లా - 74.99%
- పశ్చిమ గోదావరి జిల్లా -79.03%
- కృష్ణాజిల్లా - 79.27%
- గుంటూరు జిల్లా - 76.74%
- ప్రకాశం జిల్లా - 78.76%
- నెల్లూరు జిల్లా - 73.20%
- వైఎస్ఆర్ కాంగ్రెస్ - 80.68%
- కర్నూలు జిల్లా - 76.52%
- అనంతపురం జిల్లా - 82.26%
- చిత్తూరు జిల్లా - 75.68%
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన అనంతరం ఆయా పంచాయతీల్లోని ఉపసర్పంచ్ ను ఎంపిక చేస్తారు.