AP Panchayat Elections: కౌంటింగ్ వీడియో తీయాల్సిందే... ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. మూడు విడతల్లో ముగిసిన ఎన్నికలు, కౌంటింగ్ పై పలుచోట్ల ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చి నేపథ్యంలో ఎన్నికల కమిషనల్ కీలక ర్ణం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశాలు జారీ చేశారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు లేదా వీడియో గ్రఫీ తప్పకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రికార్డు చేసిన దృశ్యాలను భద్రపరచాలని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్సీ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
వీడియో రికార్డింగ్ కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే కౌటంగ్ కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించరాదని.., గెలుపు, ఓటములకు పది ఓట్ల తేడా ఉంటేనే రీకౌటింగ్ చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ సందర్భంగా సమాచారం లీకవుకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇటీవలే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల సందర్భంగా ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారు ఎవరైనా ఉంటే ఈనెల 20లోపు నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానైనా కలెక్టర్లకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు నిమ్మగడ్డ తెలిపారు.