Nimmagadda Ramesh: నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు ఏకంగా మంత్రిపైనే చర్యలు
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వంతో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రిపైనే చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 21 వరకు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని తెగేసిచెప్పారు. ఎన్నికలు ప్రశాంగా, సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మీడియాలో పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్పై వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా చర్యలుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాలలను పాటించి ఏకగ్రీవాలను నిలిపివేస్తే సదరు అధికారులకు బ్లాక్ లిస్ట్లో పెడతామని నిన్న మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏ విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే నిమ్మగడ్డకు మద్దతిచ్చినా, ఆయన చెప్పినట్లు చేసినా మార్చి 31 తర్వాత వారి సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పెద్దిరెడ్డి. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు.