Jagananna Ammavodi: మీకు అమ్మఒడి సొమ్ము రాలేదా-ఐతే అలా చేయండి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జగనన్న అమ్మఒడి పథకానికి (Jagananna Ammavodi) శ్రీకారం చుట్టింది. ఐతే కొంతమందికి ఇంకా నగదు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జగనన్న అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. దీని ద్వారా 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.14వేలు జమ చేసిన ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలను స్కూళ్లలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఈనెల 11 ప్రారంభించిన రెండో విడత జగనన్న అమ్మఒడి పథకం ద్వారా కొందమందికి ఇంకా నగదు జమ కాలేదు. దీంతో అర్హత ఉండీ లబ్ధి చేకూరని వారు ఆందోళన చెందుతున్నారు. పథకాన్ని ప్రారంభించి 10రోజులు గడచినా నగదు రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఐతే అర్హత ఉండీ నగదు జమకానివారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారి కోసం స్పందన హెల్ప్ లైన్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైంది. అమ్మఒడి అర్హుల జాబితాలో ఉండి నగదు ఇంకా నగదు జమకాని వారు 1902 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫోన్ చేసే ముందు విద్యార్థికి, తల్లి లేద సంరక్షునికి సంబంధించిన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
హెల్ప్ లైన్ కు ఇవ్వాల్సిన వివరాలు
- విద్యార్థి స్కూల్ ఐడీ నంబరు
- పాఠశాల జిల్లా కోడ్ నెంబర్
- విద్యార్థి ఆధార్ నంబర్
- తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నంబర్
- తల్లి లేదా సంరక్షకుని బ్యాంకు అకౌంట్ నంబర్
- ఆయా బ్యాంకు యొక్క IFSC కోడ్.
- మీ ఫోన్ నంబర్
ఇక హెల్ప్ లైన్ కు ఫోన్ చేయలేని వారు విద్యార్థి చదువుకుంటున్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా గ్రామసచివాలయంలో సంప్రదించి వివరాలు సరిచూసుకోవచ్చని చెప్తున్నారు. అమ్మఒడి అర్హుల జాబితాలో ఉండి అమ్మఒడి వర్తించకపోవడానికి హౌస్ హోల్డ్ సర్వే చేయకపోవడం కూడా మరో కారణంగా అధికారులు చెప్తున్నారు. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల్లో ఎవరికైనా నెలకు రూ.12వేల కంటే అధికంగా ఆదాయం పొందుతున్నా, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా, ఫోర్ వీలర్ ఉన్నా అమ్మఒడి వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.