ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హిందూ దేవాలయాల్లో (Hindu Temples) చోటు చేసుకుంటున్న ఘటనలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కుట్రపూరితంగానే ఆలయాలపై దాడులు చేస్తున్నారని సీఎం ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కుట్రపూరితంగానే ఆలయాలపై దాడులు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పరిపాలనను ఎదుర్కొవడం కష్టమనే కుట్రలు, కయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేనిస్థితికి వ్యవస్థ దిగజారిపోయిందని.., దేవుడి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దారుణమైన పరిస్థితులున్నాయి. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్న వారు మనుషులేనా అని సీఎం ప్రశ్నించారు. ఆలయాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభమో..!దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎవరికి చెడ్డపేరు వస్తుందో..! ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంటే సరిగ్గా.. పథకం ప్రారంభానికి ముందు రోజుగానీ.. ఆ తర్వాత గానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా సీఎం వివరించారు. ప్రభుత్వ పథకాలకు వస్తున్న పబ్లిసిటీని దారిమళ్లించేందుకు దేవుడు గుళ్లపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
సీఎం ఉదాహరణలు ఇవే
- 2019 నంవబర్ 14 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మనబడి-నాడు,నేడు ప్రారంభించామని సరిగ్గా అదే సమయంలో గుంటూరు జిల్లాలో దుర్గగుడి ధ్వంసమంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్నారు. నిజానికి అమ్మవారి విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించిన తర్వాతే రోడ్డు నిర్మాణం కోసం గుడిని తొలగించారన్నారు.
- 2020 జనవరి 21 పిఠాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారని సీఎం వివరించారు. ఈ ఘటన జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే జనవరి 15న రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు ఏర్పాటు చేశామన్నారు.
- 2020 ఫిబ్రవరి 8న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంబిస్తే అదే నెల 11న రొంపిచర్లలో వేణుగోపాల స్వామి విగ్రహం ధ్వంసం, ఫిబ్రవరి 13న ఉండ్రాజవరం మండలం, సూర్యపుపారెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారం ధ్వంసం, ఫిబ్రవరి 12న కొండ బిట్రగుంటలో ప్రసన్నాంజనేయ స్వామి రథం దగ్ధం చేశారన్నారు.
- 2020 సెప్టెంబర్ 7న అంగన్ వాడీల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రారంబం ప్రారంభించాం. సెప్టెంబర్ 6న అంతర్వేదిలో రథం దగ్ధం చేసినట్లు తెలిపారు.
- 2020 సెప్టెంబర్ 11న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభించిన వెంటనే సెప్టెంబర్ 13న దుర్గగుడి వెండి రథానికి సింహాల ప్రతిమలు మాయమయ్యాయన్నారు.
- 2020 సెప్టెంబర్ 25న వైఎస్ఆర్ జలకళ ప్రారంభానికి నాయుడుపేట తుమ్మూరు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారన్నారు.
- 2020 అక్టోబర్ 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే.దానికి పదిరోజుల ముందు అక్టోబర్ 5న కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి శేషపడుగలు ధ్వంసం చేశారని.., అలాగే అక్టోబర్ 17న కార్లపాడులో వీరభద్ర స్వామి గోపురం ధ్వంసం చేసినట్లు వివరించారు.
- పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే.. తిరుపతి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూర్ణకుంభం లైటింగ్ ను శిలువగా ప్రచారం చేశారని ఆరోపించారు.
- విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు వెళ్తున్నామని తెలిసి.పట్టాల పంపిణీ వేదికకు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో రామాలయంపై దాడి చేశారన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుండగానే రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు.
దాడులు జరిగిన ఆలయాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల అధీనంలో ఉన్నవేననని సీఎం జగన్ ఆరోపించారు. అర్ధరాత్రి దాడులు చేసి.. తర్వాత రోజు ఉదయం సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను టీడీపీ చేపడుతోందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు పోరాడాలని పిలుపునిచ్చారు. దేవుడితో రాజకీయాలు చేస్తున్న ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ హెచ్చరించారు.