ఆంధ్రప్రదేశ్లో కొత్త కోర్సులకు ఉన్నత విద్యాశాఖ రూపకల్పన చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సు నేపథ్యంలో ఏడాది పీజీ కోర్సును ప్రవేశ పెడుతున్నామన్నారు. కళాశాలల్లో తనిఖీ కోసం క్వాలిటీ అసెస్మెంట్ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ‘అకడమిక్ ఆడిటింగ్’ నిర్వహిస్తామని మంత్రి వివరించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీ, కళాశాలల్లో ‘ఇంక్యుబేషన్ సెంటర్ల’ ఏర్పాటుకు ఆదేశించామని మంత్రి సురేష్ వివరించారు. రాష్ట్రంలో ఏడు వర్సిటీలకు రీసెర్చ్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన మరో నాలుగు వర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విద్యారంగం బలోపేతానికి ప్లానింగ్ బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.