రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమిషనర్కి తెలియజేశామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఏపీ ఎన్జీవో సంఘం తీవ్రంగా మండిపడింది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమిషనర్కి తెలియజేశామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్కు వివరించారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికమని అన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్, వ్యాక్సినేషన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ, బీహార్లలో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతొందని.. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయబ్రాంతులకు గురైయ్యే ప్రమాదం ఉందని అన్నారు. 9 లక్షలకు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పిస్తారా ? అని ప్రశ్నించారు. కరోనాతో చాలామంది ఉద్యోగులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మొండిగా ముందుకు సాగితే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
తమను సస్పెండ్ చేసినా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. తాము ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటామని.. ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పాటిస్తామని.ఎన్నికల సంఘం ఆదేశాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.ఈ మొత్తం వ్యవహారం ఎటువైపు వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది.