Atal Pension Yojana scheme doubts and clarifications
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్తో లాభమెంత? ఈ స్కీమ్లో ఎలా చేరాలి? ప్రతీ నెల ఎంత జమ చేయాలి? లబ్ధిదారులకు వచ్చే ప్రయోజనాలేంటీ? అన్న డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానాలివే.
1. అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటీ?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం ఇది. అసంఘటిత కార్మికులకు ఈ పెన్షన్ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం 2015లో ప్రారంభమైంది. ఐదేళ్లలో 2 కోట్ల 40 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు చేరారు.
2. అటల్ పెన్షన్ యోజనతో ప్రయోజనాలేంటీ? ఎంత పెన్షన్ వస్తుంది?
అటల్ పెన్షన్ యోజనలో చేరితే లబ్ధిదారులకు కనీస పెన్షన్ వస్తుంది. ముందే సూచించిన పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.
3. అటల్ పెన్షన్ యోజనలో ఎవరు చేరొచ్చు?
కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ పెన్షన్ పథకంలో చేరొచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరే సమయానికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నెంబర్ కూడా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో పనిచేసేవారు, ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు కూడా ఈ స్కీమ్లో చేరొచ్చు.
4. అటల్ పెన్షన్ యోజనలో ఎంత జమ చేయాలి?
అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులు నెలకు కనీసం రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేయాలి. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ వయస్సు నుంచి రూ.5,000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ.210 చొప్పున చెల్లించాలి. 60 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ 22 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్లో చేరితే నెలకు రూ.292 చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సులో చేరితే రూ.1,454 జమ చేయాలి.
5. అటల్ పెన్షన్ యోజనలో డబ్బు ఎంతకాలం డబ్బులు జమ చేయాలి?
ఈ స్కీమ్లో చేరిన నాటి నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. తక్కువ వయస్సులో ఈ స్కీమ్లో చేరితే జమ చేయాల్సిన మొత్తం తక్కువగా ఉంటుంది. ఆటోడెబిట్ ఫెసిలిటీ ద్వారా నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు.
6. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో లబ్ధిదారులు డబ్బులు జమ చేయకపోతే ఏమవుతుంది?
జమ చేయాల్సిన తేదీ నాటికి సేవింగ్స్ అకౌంట్లో డబ్బు లేకపోతే జరిమానా చెల్లించాలి. ఓవర్డ్యూ ఇంట్రెస్ట్ ప్రతీ రూ.100 కు రూ.1 చొప్పున చెల్లించాలి. అందుకే గడువు నాటికి స్కీమ్లో డబ్బులు జమ చేయాలి. ఎక్కువకాలం డిఫాల్ట్గా ఉంటే అకౌంట్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించాలి. 6 నెలల తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. 12 నెలల తర్వాత డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుంది.
6. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో లబ్ధిదారులు డబ్బులు జమ చేయకపోతే ఏమవుతుంది?
జమ చేయాల్సిన తేదీ నాటికి సేవింగ్స్ అకౌంట్లో డబ్బు లేకపోతే జరిమానా చెల్లించాలి. ఓవర్డ్యూ ఇంట్రెస్ట్ ప్రతీ రూ.100 కు రూ.1 చొప్పున చెల్లించాలి. అందుకే గడువు నాటికి స్కీమ్లో డబ్బులు జమ చేయాలి. ఎక్కువకాలం డిఫాల్ట్గా ఉంటే అకౌంట్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించాలి. 6 నెలల తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. 12 నెలల తర్వాత డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుంది.
7. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరిన తర్వాత పెన్షన్ మార్చుకోవచ్చా?
రూ.1,000 నుంచి రూ.5000 మధ్య పెన్షన్ ఎంచుకోవచ్చు. ఒకసారి ఎంచుకున్న తర్వాత పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఏడాదికి ఓసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జమ చేయాల్సిన మొత్తం వయస్సును బట్టి మారుతుంది.
8. అటల్ పెన్షన్ యోజనలో పెన్షన్ కార్పస్ అంటే ఏంటీ?
లబ్ధిదారులు జమ చేసిన మొత్తాన్ని పెన్షన్ కార్పస్ అంటారు. పెన్షన్ తీసుకుంటున్న సమయంలో లబ్ధిదారులు మరణిస్తే వారికి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. పెన్షన్ రూ.1,000 అయితే పెన్షన్ కార్పస్ రూ.1,70,000, పెన్షన్ రూ.2,000 అయితే రూ.3,40,000, పెన్షన్ రూ.3,000 అయితే రూ.5,10,000, పెన్షన్ రూ.4,000 అయితే రూ.6,80,000, పెన్షన్ రూ.5,000 అయితే రూ.8,50,000 పెన్షన్ కార్పస్ లభిస్తుంది.
9. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్లు ముందుగానే మరణిస్తే డబ్బులు ఏమవుతాయి?
అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో డబ్బులు జమ చేస్తుండగానే అంటే 60 ఏళ్లలోపే సబ్స్కైబర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే వారు సూచించిన నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది.
10. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో ఎలా చేరాలి?
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంక్, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఫామ్ పూర్తి చేసి ఇచ్చిన తర్వాత దరఖాస్తును పరిశీలిస్తారు. దరఖాస్తుకు ఆమోదం లభించగానే ఖాతాదారులకు సమాచారం అందుతుంది.