ఉపాధ్యాయ బదిలీల గురించి విద్యాశాఖ మంత్రి గారి పత్రికా విలేకరుల సమావేశం పూర్తి వీడియో
వెబ్కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ, 30 % ఖాళీలనే బ్లాక్ చేశాం : మంత్రి ఆదిమూలపు సురేష్
ఉపాధ్యాయ బదిలీలల్లో కేటగిరి-3, 4 ప్రాంతాల్లోని పాఠశాలల్ని దృష్టిలో ఉంచుకుని 30 శాతం ఖాళీలను బ్లాక్ చేయడం ఏటా జరిగేదేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 50 శాతం పోస్టులు బ్లాక్ చేసినట్లు ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘బదిలీకి ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక శుక్రవారం మొదలై ఈ నెల 15 వరకు ఉంటుంది. ఈ ఐదు రోజులూ ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయి. 16న వెబ్ఆప్షన్ను నిలిపేస్తాం. 21న తుది జాబితా ప్రకటిస్తాం. 24న బదిలీ ఉత్తర్వులు తీసుకుని విధుల్లో చేరవచ్చు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించడానికే ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల మంది ఉపాధ్యాయులకు మాన్యువల్గా కౌన్సెలింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ సాఫ్ట్వేర్లో లోపాలు ఉన్నాయన్నది అపోహ మాత్రమే’నని వివరించారు.
‘ఖాళీలను నాలుగు కేటగిరీలుగా విభజించాం. నాలుగో కేటగిరీలో పనిచేసే వారు పొందే స్టేషన్ సర్వీసు పాయింట్ల ఆధారంగా 20 శాతం హెచ్ఆర్ఏ పొందే మొదటి కేటగిరీ ప్రాంతంలో పోస్టింగ్ పొందే అవకాశం వస్తుంది. సీనియారిటీ జాబితానూ ప్రకటించాం. కేటగిరి-1, 2ల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. హేతుబద్దీకరణ ఆధారంగా ఖాళీలను భర్తీ చేయకుంటే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి దెబ్బతింటుంది. బ్లాక్ చేసిన ఖాళీలను భర్తీ చేసిన తర్వాత కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు పొందిన వారికి పోస్టింగ్లు ఇస్తామ’ని మంత్రి పేర్కొన్నారు.