State Bank of India New Rule From Jan-1
జనవరి 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కొత్త రూల్ అమలు చేయబోతోంది. అది మీపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. 2021 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రాబోతోంది. మీరు పేమెంట్స్ కోసం ఎక్కువగా చెక్స్ ఇస్తున్నట్టైతే ఈ రూల్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చెక్ పేమెంట్స్ విషయంలో పాజిటీవ్ పే సిస్టమ్ ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 1 నుంచి బ్యాంకులన్నీ పాజిటీవ్ పే సిస్టమ్ అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో బ్యాంకులు ఈ మేరకు మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కొత్త సంవత్సరంలో ఈ రూల్ అమలు చేస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి చెక్ పేమెంట్స్కి పాజిటీవ్ పే అమలు చేస్తున్నట్టు తెలిపింది. రూ.50,000 పైన చెక్ పేమెంట్స్కి ఈ రూల్ వర్తిస్తుంది.
ఎస్బీఐ కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించాలనుకుంటే వెంటనే సమీపంలోనే బ్రాంచ్లో సంప్రదించాలని కోరింది. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే, ఎక్కువగా చెక్ పేమెంట్స్ చేస్తున్నట్టైతే పాజిటీవ్ పే సిస్టమ్ ఉపయోగించేందుకు మీ బ్రాంచ్లో సంప్రదించాలి.
Keeping all your transactions safe including those done via Cheques.
— State Bank of India (@TheOfficialSBI) December 29, 2020
SBI is introducing Positive Pay System from 1st January 2021 to make Cheque payment secure. To know more, contact your nearest SBI branch.#SBI #StateBankOfIndia #PositivePaySystem #PPS #ChequePayment pic.twitter.com/Ah6vL7MjHu
పాజిటీవ్ పే సిస్టమ్ అంటే ఏంటీ?
మీరు ఎవరికైనా పేమెంట్ కోసం చెక్ ఇస్తే, మీరు ఇచ్చిన వివరాలను రీ-కన్ఫర్మేషన్ చేసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ద్వారా అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ పైన రాసిన అమౌంట్, చెక్ డేట్, పేయీ లేదా బెనిఫీషియరీ పేరు లాంటి వివరాలను మీరు రీ-కన్ఫామ్ చేసిన తర్వాత చెక్కు క్లియర్ అవుతుంది. రూ.50,000 కన్నా ఎక్కువ అమౌంట్తో జారీ చేసే చెక్స్కి ఇది వర్తిస్తుంది.
పాజిటీవ్ పే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఉదాహరణకు మీరు ఎవరికైనా రూ.75,000 అమౌంట్తో చెక్ ఇచ్చారనుకుందాం. ఇప్పటివరకు ఉన్న పద్ధతి అయితే సదరు వ్యక్తి బ్యాంకులో చెక్ డిపాజిట్ చేసిన తర్వాత, చెక్ క్లియర్ కాగానే డబ్బులు మీ అకౌంట్ నుంచి ఆ వ్యక్తి అకౌంట్లోకి వెళ్తాయి. కానీ పాజిటీవ్ పే సిస్టమ్ ద్వారా చెక్ వెంటనే క్లియర్ కాదు. చెక్ క్లియర్ కావాలంటే మీరు వివరాలను కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చెక్ ఇవ్వగానే సదరు వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఆ తర్వాత మీకు సమాచారం అందుతుంది. ఆ చెక్కులో ఉన్న వివరాలన్నీ సరైనవేనా కాదా అని మీరు కన్ఫామ్ చేయాలి. మీరు కన్ఫామ్ చేసిన తర్వాతే చెక్ క్లియర్ అవుతుంది.
పాజిటీవ్ పే సిస్టమ్ ఎందుకు?
చెక్కుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. చెక్కు ఫోర్జరీ చేసి మీ అకౌంట్ నుంచి ఎక్కువ డబ్బులు కాజేయకుండా పాజిటీవ్ పే సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ చెక్స్ దొరికినా వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. చెక్కు డిపాజిట్ చేయగానే మీకు సమాచారం అందుతుంది కాబట్టి మీరు చెక్ క్లియర్ కాకుండా ఆపొచ్చు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు కస్టమర్ల నుంచి చెక్ పేమెంట్స్కు కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాయి.