పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్తో కలిసి ఆదివారం ఆయన మాట్లాడారు. వేతన సవరణ కమిషన్ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ పీఆర్సీలో 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన కమిటీ నివేదికలను పరిశీలించి సీఎం జగన్మోహన్రెడ్డి హామీని అమలు చేయాలని కోరారు. మూడు కరవు భత్యాలు(డీఏ) వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఐదురోజుల సీఎల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, ఈ క్రతువులో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కావాల్సి ఉంటుందని చెప్పారు. విశాఖ రాజధానిని అమల్లోకి తేవాలని, రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు తోడ్పాటు అందిస్తారని పేర్కొన్నారు.