➧క్లియర్ వేకెన్సీలను ప్రభుత్వం బ్లాక్ చేయడంతో ఉపాధ్యాయుల్లో కలవరం
➧అనుకున్న చోటకు బదిలీ కాదేమోనని దిగులు
➧ప్లెయిన్ ఏరియాలో ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి
➧ఈసారి ఏజెన్సీ తప్పదేమోనని ఆందోళన
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో దరఖాస్తుల ఘట్టం పూర్తయ్యింది. అయితే ఎక్కడ క్లియర్ వేకెన్సీలున్నాయో తెలియక వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమకు అనుకున్న చోట పోస్టింగ్ వస్తుందో లేదోనని కలవరపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన బదిలీ కౌన్సెలింగ్లో క్లియర్ వేకెన్సీలు, రేషనలైజేషన్ ఖాళీలను డీఈవో వెబ్సైట్లో చూపించేవారు. దీంతో సాధ్యమైనంత వరకు వారు కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రభుత్వం నేరుగా విద్యా శాఖ కమిషనరేట్కు అప్పగించింది. దీంతో బదిలీ కోసం కమిషనరేట్ వెబ్సైట్కు అందిన దరఖాస్తులను పరిశీలించి అభ్యంతరాలను సవరించడానికి మాత్రమే ప్రభుత్వం డీ ఈవోలకు అవకాశమిచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో ప్రతి మండలంలో ఉన్న మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) ఐదు శాతం, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పది శాతం ప్రభుత్వం బ్లాక్ చేసింది. మండలాల్లో పనిచేస్తున్న హెచ్ఎంల్లో 600 పోస్టులు బ్లాక్ చేశారని సమాచారం. అయితే జిల్లాలో ఉన్న పరిస్థితి దృష్ట్యా డీఈవో అభ్యర్థన మేరకు ప్రభుత్వం వీటిని 450కు తగ్గించినట్టు తెలుస్తోంది. మిగిలిన పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. బ్లాక్ చేసిన ఖాళీలను సిఫార్సులతో భర్తీ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ బదిలీల్లో గ్రామాలకు రహదారి, రవాణా స దుపాయం లేకుండా ఉన్న సుమారు 165 పాఠశాలలను కేటగిరీ-4గా గుర్తించారు. అన్ని మండలాల్లో కేటగిరీ 1, 2, 3 పోస్టుల్లో పది శాతం ఖాళీలను రిజర్వు చేయాలని ఎం ఈవోలకు విద్యా శాఖ సూచించింది. దీంతో వారు అను కున్న సంఖ్య కంటే ఎక్కువ పోస్టులను బ్లాక్ చేశారు. దీని ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో డీఈవో కార్యాలయం చొరవచూపి కొన్ని ఖాళీల సంఖ్యను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఈ పాఠశాలల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న పలువురు సీనియర్ ఉపాధ్యాయుల గొంతులో వెలక్కాయ పడింది. ప్రస్తుతం వీరి దరఖాస్తుల పరిశీలన తుది అం కానికి చేరుకుంటోంది. అనంతరం సీనియారిటీ జాబితా మేరకు ఖాళీల ఎంపిక చేపట్టనున్నారు. బదిలీల్లో అవలంబిస్తున్న పద్ధతి వల్ల కొందరు ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతోందని, మరికొందరికి నష్టం కలిగేలా ఉం దని ప్రచారం జరుగుతోంది. ఈసారి అన్ని కేటగిరీల్లో ఎస్జీటీలే ఎక్కువ మంది బదిలీ కానున్నారు.
ఇప్పుడు జరిగే బదిలీలకు 7,425 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,127 మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నారు. ఇందులో 60 శాతం ఎస్జీటీలు బదిలీ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారికి రిక్వస్ట్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇచ్చారు. స్టేషన్ సీనియారిటీ, సీలింగ్ పాయింట్లు ఎత్తేయడంతో తప్పనిసరి బదిలీ అయ్యే కొందరు ఎస్జీటీ, ఎస్ఏలకు ఊరట లభించనుంది.
ఏజెన్సీ భయం
ఇప్పటివరకు జిల్లాలో జరిగిన టీచర్ల బదిలీల్లో అధిక శాతం మంది ప్లెయిన్ ఏరియాల్లో కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేవారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2017లో జరిగిన బదిలీల్లో కూడా చాలా మంది ఏజెన్సీకి బదిలీపై వెళ్లలేదు. దీంతో సబ్ ప్లాన్, రిమోట్ ఏరియాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. ఈసారి వారు చేసిన సర్వీస్ సీనియారిటీ ప్రకారం ఆన్లైన్లో బేరీజు వేసి సింహభాగం ఉపాధ్యాయులను ఏజెన్సీకి బదిలీ చేయాలని ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. దీంతో ఏజెన్సీ ముఖం చూడని వారు తప్పని పరిస్థితిలో అక్కడ పనిచేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.