స్కూల్ బ్యాగ్ పాలసీ-2020ని తీసుకొచ్చిన కేంద్ర విద్యాశాఖ దాని అమలుకు చర్యలు తీసుకుంది.
- రాష్ట్రాలకు కేంద్రం సూచన
- పిల్లల బరువులో స్కూల్ బ్యాగ్ 10 శాతం మించొద్దు
- క్విజ్, ఆటలు, పాటల పోటీలు నిర్వహించాలి.
స్కూళ్లకు వెళుతున్న పిల్లలకు కేంద్రం శుభవార్త చెప్పింది. విద్యా సంవత్సరంలో కనీసం 10 రోజులు విద్యార్థులు స్కూల్ బ్యాగ్ లేకుండా స్కూళ్లకు వచ్చేలా నో స్కూల్ బ్యాగ్ డే (No School Bag Day) అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అలాగే స్కూల్ బ్యాగ్ బరువూ తక్కువగా ఉండాలని పిల్లల బరువులో 10 శాతం మించొద్దని పేర్కొంది.
స్కూల్ బ్యాగ్ పాలసీ-2020ని తీసుకొచ్చిన కేంద్ర విద్యాశాఖ దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది. ‘నో స్కూల్ బ్యాగ్’ రోజుల్లో విద్యార్థులకు క్విజ్, ఆటలు, పాటల పోటీలు లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ప్రతి మూడు నెలలకొకసారి బడిసంచులు తూకం వేసేందుకు వీలుగా పాఠశాలల్లో డిజిటల్ తూకం మెషీన్స్ సమకూర్చుకోవాలని తెలిపింది.
అలాగే 1,2 తరగతులకు ఒకే నోట్బుక్ ఉండాలని విద్యార్థులు పలచగా ఉండే పేపర్స్తో కూడిన పుస్తకాలు వాడాలని పేర్కొంది. అవసరం లేని వస్తువులు పంపవద్దని తల్లిదండ్రులుకు చెప్పాలని సూచించింది. సంచి బరువుపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.
మద్రాస్ హైకోర్టు తీర్పుతో నిర్ణయం:
స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేందుకు ఓ విధానం రూపొందించాలని.దాని అమలు చర్యలు తీసుకోవాంటూ 2018 మే నెలలో మద్రాస్ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు నిపుణులతో అదే సంవత్సరం అక్టోబరులో ఓ కమిటీని నియమించింది. బడిసంచి బరువుపై దేశవ్యాప్తంగా 352 పాఠశాలలపై సర్వే నిర్వహించారు.
1-5 తరగతుల స్కూల్ బ్యాగ్లు ఉండాల్సిన బరువు కంటే 2-3 కిలోలు అధికంగా ఉంటున్నాయని సర్వేలో తేలింది. ఈ క్రమంలో రూపొందించిన కొత్త విధానంలో సంచి బరువుపై కేంద్రం పలు సూచనలు చేసింది.