Tuesday, December 8, 2020

New Scheme introducing on ys jagan birthday



Read also:

New Scheme introducing on ys Jagan birthday

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌ 21 ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ పథకంపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేస్తారు. 17,460 గ్రామాల్లో సర్వే జరగనుంది. మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే చేయాలని ప్రణాళిక రచించారు. పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేయనున్నారు. 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో సర్వే చేస్తారు. 2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములూ సర్వేలోకి వస్తాయి.

ఇక సర్వే పూర్తయిన తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు ఇస్తారు. ఆ కార్డులో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఉంటుంది. ఆ ప్రాపర్టీ (భూమి) కొలతలు, మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. దీంతోపాటు క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. అలాగే, సర్వే పూర్తైన తర్వాత డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు తయారీ చేయనున్నారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉండేలా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. భూ కొలతలు పూర్తైన తర్వాత సర్వే రాళ్లు పాతుతారు. గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌ ఉంటాయి. వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.

సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ

ఈ సర్వే కోసం ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాససింగ్‌ టీం, రీసర్వే టీం ఉంటాయి. 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మిగిలిన వారికీ పూర్తి చేస్తామని చెప్పారు. సర్వే ఆఫ్‌ ఇండియాతో డిసెంబర్ 9వ తేదీన అవగాహన ఒప్పందం కుదర్చుకుంటున్నామని వెల్లడించారు.

గ్రామస్థాయిలోనే రెవిన్యూ సర్వీసులు

ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాపులు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో ఏమైనా మార్పులు కావాలంటే చేయాలన్నారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.

సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. అయితే ప్రజల్లో సందేహాలు రేకెత్తించి ఈ కార్యక్రమానికి అవాంతరాలు కలిగించడానికి విష ప్రచారాలు చేస్తున్నారు. సమగ్ర సర్వేపై కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. అనుమానాలకు దారి తీస్తున్న అంశాలను గుర్తించి వారికి సరైన సమాచారాన్ని చేరవేయాలి. సమగ్ర సర్వే ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుందో ప్రజలకు వివరించాలి. సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేషన్‌ ఇవ్వండి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్‌ చేయలేని రీతిలో భద్రపరచాలి. సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలి. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలి. భూ యజమానుల వద్ద హార్డ్‌ కాపీ ఉండేలా చూడాలి.’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

సర్వే శిక్షణకోసం తిరుపతిలో కొత్త కాలేజీ

సర్వే శిక్షణ కోసం తిరుపతిలో కొత్తగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం కూడా జరగాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :