దేశంలోని వివిధ రంగాలకు సంబంధించి మారుతున్న అనేక నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే వాటిని వినియోగించే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
దేశంలో జనవరి 1 నుంచి అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇందులో అనేక రంగాలకు సంబంధించిన అనేక నిబంధనలు ఉన్నాయి.
చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి పాజిటివ్ పే సిస్టం పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది.
వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది.
ఇక దేశంలో ల్యాండ్లైన్ల నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి త్వరలో '0' నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్ను టెలికాం విభాగం కోరింది.
జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవపై అదనపు ఛార్జీ విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్లపై ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది.
చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది.
ఇక రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. దీంతో 94 లక్షల జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది.