తెలుగు ప్రజలకు శుభవార్త-బెంగాల్ సీఎం మమత కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలని మమతా ప్రయత్నాలు చేస్తుంటే.. దీదీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. నేతల పార్టీ మార్పులతో అక్కడి రాజకీయాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు బెంగాల్లో ఉన్న తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించారు.
పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో ఎక్కువ మంది తెలుగు వారు నివసిస్తున్నారు.
అందుకే ఖరగ్పూర్ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు. రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వేలాది తెలుగు వారు బెంగాల్కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాదు స్థానిక రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఖరగ్పూర్ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరుగురు తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉన్నారు. అంతేకాదు పలు పార్టీల్లోనూ లు కీలక పదవులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకే తెలుగుకు అధికార భాష హోదా కల్పించారు మమత.బెంగాలీతో పాటు హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియాకు ఇప్పటికే అధికార భాష హోదా ఉంది. తెలుగుకు కూడా అధికార భాష హోదా కల్పించాలని అక్కడి ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలుగుకు అధికార భాష హోదాను కట్టబెట్టారు మమతా బెనర్జీ. ఆమె నిర్ణయం పట్ల బెంగాల్లోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎన్నికల వేళ బెంగాలీ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్కు తెలరేపింది. ఇటీవల హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించి.. మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. అంతేకాదు టీఎంసీ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీ గూటికి చేరారు. మంత్రి సుబేందు అధికారితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కేబినెట్ సమావేశానికి కూడా పలువురు మంత్రులు డుమ్మాకొట్టడం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. మరి వీరంతా టీఎంసీకి షాకిస్తారా? బీజేపీలో చేరతారా? అనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.