ఎల్పీజీ సిలిండర్ వాడుతున్నవారికి షాక్. సిలిండర్ ధరల్ని భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు. అన్ని ప్రధాన నగరాల్లో సిలిండర్ ధరలు పెరిగాయి. ధర ఎంత పెరిగిందో తెలుసుకోండి.
1. ఆయిల్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. సైలెంట్గా సిలిండర్ ధరల్ని పెంచేశాయి. సాధారణంగా ప్రతీ నెల 1న సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. కానీ డిసెంబర్ 1న పాత ధరల్నే ప్రకటించిన ఆయిల్ కంపెనీలు... వారం తర్వాత సిలిండర్ ధరల్ని పెంచాయి.
2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ చూస్తే అన్ని ప్రధాన నగరాల్లో 14.2 కేజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. డిసెంబర్ 1న ఉన్న ధరలతో పోలిస్తే ఇవాళ్టి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ చోట సిలిండర్పై రూ.50 పెంచింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
3. ఇండేన్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారు ఇకపై రూ.50 ఎక్కువగా చెల్లించాలి. గత ఐదు నెలలుగా సిలిండర్ ధరలు పెరగలేదు. అంతకుముందు మూడు నెలలు సిలిండర్ ధరల్ని కాస్త తగ్గించాయి కంపెనీలు. ఐదు నెలలుగా ధరల్ని పెంచకుండా ఇప్పుడు ఒకేసారి రూ.50 పెంచాయి.
4. హైదరాబాద్లో 14.2 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.696.50. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐదు నెలలుగా సిలిండర్ల ధరల్ని పెంచని ఆయిల్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు సైలెంట్గా షాక్ ఇచ్చాయి.
5. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం విలువ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సిలిండర్ ధరల్ని పెంచాయి ఆయిల్ కంపెనీలు.
6. ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లను సబ్సిడీకి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కుటుంబం ఒక ఏడాదిలో గరిష్టంగా 12 ఎల్పీజీ సిలిండర్లను సబ్సిడీ రేటుకే తీసుకోవచ్చు
7. కస్టమర్లు ముందుగా మొత్తం ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనాలి. వారి బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం సబ్సిడీని క్రెడిట్ చేస్తుంది. అయితే చాలామంది కస్టమర్లకు మే నుంచి సబ్సిడీ రాలేదన్న వార్తలొస్తున్నాయి.