Read also:
Final exams in the last week of April
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల తరగతుల విద్యార్థులకు సంవత్సరాంత (సమ్మేటివ్) పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) శనివారం అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. కోవిడ్ వల్ల తరగతులను చాలా ఆలస్యంగా, దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పని దినాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాల బోధనను ఎన్సీఈఆర్టీ సర్దుబాటు చేసింది. ముఖ్యమైన అంశాలను తరగతి గదిలో బోధన చేయిస్తూ.. కృత్యాధారిత కార్యక్రమాలు, ఇతర అంశాలను విద్యార్థులు ఇంటి వద్ద అభ్యసించేలా చర్యలు చేపట్టింది ఆన్లైన్ బోధనను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ చివరి వరకు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. మొత్తం 138 పనిదినాలు అందుబాటులో ఉంటాయని.. ఇందులో 102 పని దినాలు స్కూళ్లలో బోధనకు, 36 పని దినాలు ఇంటివద్ద నేర్చుకునేందుకు వీలుగా పాఠ్య ప్రణాళికను ఇప్పటికే అందించింది. మరోవైపు పరీక్షలను కూడా కుదించింది. గతంలో ఫార్మేటిట్లు 4 ఉండగా.ఈసారి రెండుకు పరిమితం చేసింది అలాగే సమ్మేటిమ్లు రెండు ఉండగా.. ఒక్కటి మాత్రమే నిర్వహించబోతోంది.
నెలల వారీగా అందుబాటులో ఉన్న పని దినాలు
నెల | పనిదినాలు | స్కూలు పనిదినాలు | ఇంటివద్ద పనిదినాలు |
డిసెంబర్ | 18 | 13 | 5 |
జనవరి | 31 | 21 | 10 |
ఫిబ్రవరి | 28 | 23 | 5 |
మార్చి | 31 | 25 | 6 |
ఏప్రిల్ | 30 | 20 | 10 |
మొత్తం | 138 | 102 | 36 |
(నోట్: జనవరిలో పనిదినాలను 31 రోజులుగా విద్యా శాఖ ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఇంటి పనిదినాలుగా కొనసాగించనున్నారు)
పరీక్షల తేదీలు
ఫార్మేటివ్ 1 - తేదీని తర్వాత ప్రకటిస్తారు
ఫార్మేటివ్ 2 ఫిబ్రవరి చివరి వారంలో
సమ్మేటివ్ ఏప్రిల్ చివరి వారంలో